
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పదవి విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తామని సౌరవ్ గంగూలీ అన్నాడు. పదవి నుంచి తప్పుకోమని ధర్మాసనం ఆదేశిస్తే.. తనతో పాటు సెక్రటరీ జైషా కూడా బోర్డుకు దూరంగా ఉంటాడని దాదా స్పష్టం చేశాడు.
బీసీసీఐ నూతన రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషా పదవీ కాలం ఇప్పటికే పూర్తయింది. దీంతో లోధా కమిటీ సూచించిన మూడేళ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్పై సవరణ కోరుతూ బోర్డు.. కోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీం నుంచి తీర్పు వచ్చే దాకా గంగూలీ, జైషా బోర్డు పదవుల్లో కొనసాగనున్నారు. బీసీసీఐ అప్పీలును స్వీకరించిన సుప్రీం కోర్టు జస్టిస్ అరవింద్ బోబ్డే, ఎల్ నాగేశ్వరరావుతో కూడిన బెంచ్కు అప్పగించింది.
దీనిపై సోమవారం విచారణ జరగాల్సి ఉండగా ధర్మాసనం తన లిస్ట్లో ఈ కేసును చేరలేదు. దీంతో విచారణకు మరికొంత కాలం ఆగాల్సి ఉంది. దీనిపై గంగూలీ మాట్లాడుతూ.. తప్పో.. ఒప్పో మా కోసం బోర్డు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇక అంతా న్యాయస్థానం చేతిలోనే ఉంది. వారు పదవిలో కొనసాగమంటే ఉంటాం. వద్దంటే వెళ్లిపోతాం'అని స్పష్టం చేశాడు.
బెంగాల్ క్రికెట్ అసోసియేషన్లో గంగూలీ, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్లో జైషా వరుసగా ఐదేళ్లు పనిచేశారు. ఇక బీసీసీఐలో ఏడాది పదవి కాలం పూర్తయింది. లోధా కమిటీ నిబంధనల మేరకు క్రికెట్ అసోసియేషన్లలో ఆరేళ్ల పాటు పనిచేస్తే మూడేళ్లు దూరంగా ఉండాలి.