
కోల్కతా: ఈ ఏడాది సెప్టెంబర్లో జరగాల్సిన ఆసియా కప్ దుబాయ్లో జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. ఈ టోర్నీ పాకిస్తాన్లో జరగాల్సి ఉండగా...పాక్లో ఆడలేమంటూ బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో మార్పు అనివార్యమైంది.
'ఆసియా కప్ దుబాయ్లో జరుగుతుంది. ఇండియా, పాకిస్థాన్ జట్లు రెండూ ఆడతాయి' అని గంగూలీ వెల్లడించాడు. మార్చి 3న జరగనున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో పాల్గొనడానికి దుబాయ్ వెళ్తూ ఈడెన్ గార్డెన్స్లో మాట్లాడుతూ గంగూలీ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తున్న మహిళల టీ20 ప్రపంచకప్లో అమ్మాయిల జట్టు అద్భుతంగా రాణిస్తోందని గంగూలీ కొనియాడాడు. న్యూజిలాండ్ పర్యటనలో టెస్టు సిరీస్లో వెనుకబడిన విరాట్ సేన రెండో టెస్టులో పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు.
భారత్, పాక్ల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ఇరు జట్ల మధ్య 2012-13 నుంచి ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రం తలపడుతున్నాయి.