
రహస్య సమావేశం
లండన్లో రెండో టెస్టు సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, సెక్రటరీ జే షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కెప్టెన్ విరాట్ కోహ్లీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారని సమాచారం తెలిసింది. త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్పైనే వీరు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం భారత్ లక్ష్యం ఇంగ్లండ్పై టెస్టు సిరీస్ గెలవడమే అయినా.. అక్టోబర్-నవంబర్లో జరిగే ప్రపంచకప్ కూడా కోహ్లీ కెప్టెన్సీకి ఎంతో కీలకం. ఎందుకంటే విరాట్ సారథ్యంలో భారత్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్, 2021 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో రాబోయే ఐసీసీ ట్రోఫీ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే బీసీసీఐ పెద్దలు జట్టు సారథిని కలవడం అందరిలో ఆసక్తి నెలకొంది.

రోడ్ మ్యాప్ గురించి
ఈ సమావేశంలో చర్చించిన అంశాలు బయటకు చెప్పడం మంచిది కాదంటూనే.. ఐపీఎల్ తర్వాత భారత్ ఆడాల్సింది టీ20 ప్రపంచకప్పే అయినందున దాని గురించే చర్చించి ఉంటారని ఆ అధికారి పేర్కొన్నారు. 'నిజమే.. బీసీసీఐ పెద్దలు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో సమావేశమయ్యారు. టీ20 ప్రపంచకప్ 2021కు చాలా తక్కువ సమయం ఉంది. ఐపీఎల్ 2021 వెంటనే మెగా టోర్నీ జరగనుంది.
దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ గురించి చర్చించుకొని ఉంటారు' అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు ఐపీఎల్ 2021 జరగనుండగా.. అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.
IND vs ENG:మహమ్మద్ సిరాజ్.. వేరే లెవెల్ అబ్బా! హైదరాబాద్లో భారీ కటౌట్లు! సూపర్ స్టార్ మాదిరి!

సిరాజ్ ఉంటాడా
వచ్చే నెలలో భారత్ ప్రపంచకప్ జట్టును ఎంపిక చేయకముందు కొన్ని ప్రధాన విషయాలపై అటు సెలెక్టర్లు, ఇటు జట్టు యాజమాన్యం దృష్టిసారించాల్సి ఉంది. టీ20 క్రికెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లను కూడా సవాలు చేసే ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏయే ఆటగాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి విశ్లేషిస్తే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ను మెగా టోర్నీకి ఎంపిక చేసే అవకాశం లేదు. జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ ఐపీఎల్లో ఆడుతుండటంతో వారి పనిభారాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. మరోవైపు మొహ్మద్ సిరాజ్ టెస్టు క్రికెట్లో రాణిస్తున్నా అతడిని టీ20 ఫార్మాట్కు ఎంపిక చేస్తారా అనేది కీలకం కానుంది.

సూర్యకుమార్ or శ్రేయస్
దీపక్ చహర్, భువనేశ్వర్ కుమార్ సైతం బుమ్రా, షమికి తోడుగా ఉంటారు. దాంతో పేస్ బౌలింగ్ విభాగంలో ఈ నలుగురూ సరిపోయే అవకాశం ఉంది. మణికట్టు స్పిన్నర్ల జాబితాలో రవీంద్ర జడేజా, యుజువేంద్ర చహల్కు తోడు రాహుల్ చహర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలలో ఎవరిని తీసుకుంటారో చూడాలి. ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేస్తాడా లేదా అంచనా వేయాలి.
ఇక నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్లో ఎవరిని పరిగణనలోకి తీసుకుంటారో చూడాలి. ఇలాంటి పరిస్థితుల్లో చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీ త్వరలో సమావేశమౌతారని బీసీసీఐ భావిస్తోంది. 2013లో చివరిసారి ధోనీ సారథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన భారత జట్టు ఇప్పటివరకూ మరో ఐసీసీ ట్రోఫీ గెలవలేదు.


Click it and Unblock the Notifications












