
కోల్కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. నాలుగు రోజుల క్రితం రెండోసారి గుండె నొప్పితో దాదా ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. గుండె నిపుణులు డాక్టర్ దేవి శెట్టి, డాక్టర్ అశ్విన్ మెహతాలతో కూడిన వైద్య బృందం దాదాకు చికిత్స అందించారు.
గంగూలీ బాగానే ఉన్నారని, ఇప్పుడాయన గుండె సాధారణ స్థితిలో ఉందని వైద్యులు వెల్లడించారు. మరో రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని పేర్కొన్నారు. అలాగే కొద్ది నెలల పాటు క్రమం తప్పకుండా ఆయన మందులు వాడాలని సూచించారు.
కాగా, జనవరి 2న దాదాకు చాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. అప్పుడు గుండె రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు వాటిని తొలగించి యాంజియోప్లాస్టీ చేశారు. తర్వాత డిశ్ఛార్జి అయ్యి ఇంటికి వెళ్లాక క్రమంగా కోలుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే బుధవారం మరోసారి చాతిలో ఇబ్బందిగా అనిపించడంతో ఆస్పత్రికి వెళ్లారు. మళ్లీ పరీక్షించిన వైద్యులు రెండోసారి యాంజియోప్లాస్టీ అవసరమని భావించి గురువారం రెండు స్టెంట్లను అమర్చారు. ఇప్పుడు ఆయన పరిస్థితి మెరుగ్గా ఉండడంతో ఆదివారం డిశ్చార్జి చేశారు.