|
బీసీసీఐ సవాల్.. పిచ్ ఎక్కడా?
అయితే శనివారం క్రైస్ట్చర్చ్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. ఈ వేదికకు సంబంధించిన పిచ్ ఫొటోను బీసీసీఐ గురువారం ట్వీట్ చేసింది. పూర్తిగా పచ్చికతో నిండిపోయిన ఈ మైదానంలో పిచ్ ఎక్కడో గుర్తించండి? అనే ప్రశ్నను క్యాప్షన్గా పేర్కొని అభిమానులకు సవాల్ విసిరింది. స్పాట్ ద పిచ్ అని కామెంట్ చేసిన బీసీసీఐ.. ఆలోచిస్తున్న రెండు ఎమోజీలను పోస్టు చేసింది. న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా అని హ్యాష్ ట్యాగ్ జత చేసింది. ఇక ఈ పోస్ట్ను చూసిన అభిమానులు.. వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
|
షరపోవాకు ఇలా వీడ్కోలా?
పూర్తిగా పచ్చికతో కప్పి ఉన్న పిచ్ను చూసి అభిమానులు బెంబేలెత్తుతున్నారు. టీమిండియాను ట్రోల్ చేస్తూ ఫన్నీ కామెంట్లు, మీమ్స్లతో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నారు. బుధవారం తన టెన్నిస్ కెరీర్కు గుడ్బై చెప్పిన రష్యా స్టార్ మరియా షరపోవా అంశాన్ని ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. షరపోవాకు ఘన వీడ్కోలు పలకడానికి ఇలా పచ్చిక మైదానాలను ఏర్పాటు చేశారా? అని ప్రశ్నిస్తున్నారు.
|
పృథ్వీ షా.. భయపడ్డావా?
ఈ పిచ్ను చూసిన పృథ్వీషాకు దెబ్బకు జ్వరం వచ్చినట్టుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరోవైపు న్యూజిలాండ్ టూర్లో షా వరుసగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. మూడు వన్డేలు, ఒక ప్రాక్టీస్ మ్యాచ్, తొలి టెస్టు ఆడిన షా.. కనీసం ఒక్క అర్ధసెంచరీ కూడా చేయలేక చతికిల పడ్డాడు. తాజాగా గాయం కారణంగా తను రెండోటెస్టులో ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ పిచ్పై భారత ఆటగాళ్లు ఆడటం కష్టమని, రెండో టెస్టులో భారత్ ఓడిపోతుందని కామెంట్ చేస్తున్నారు. ‘షరామాములుగానే రెండో టెస్టులోభారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ ఓడిపోతాడు. అలాగే చాలా ఉత్కృష్టమైన మన భారత బ్యాటింగ్.. ఈ పిచ్పై ఆడలేక చేతులెత్తేస్తుంది.'అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
తవ్వుకున్న గొయ్యిలోనే..
ఇంకొందరూ ఎవరు తవ్వుకున్న గొయ్యిలో వారే పడ్డట్టూ.. న్యూజిలాండ్ ఓటమిపాలవుతుందంటున్నారు. భారత బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టాలని గ్రీన్ పిచ్ను సిద్ధం చేసిన న్యూజిలాండ్ అదే వ్యూహానికి బలయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. టాస్ ఓడి తొలుత న్యూజిలాండ్ బ్యాటింగ్కు దిగినట్లయితే, భారత బౌలర్లను ఎదుర్కోవడం తలకుమించిన వ్యవహరమేనని, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ, జస్ప్రీత్ బుమ్రాలాంటి నిఖార్సైన పేసర్లు మన జట్టులో ఉండటంతో కివీస్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశముందంటున్నారు. గతంలో సౌతాఫ్రికాలో పర్యటనలో సఫారీ జట్టులో ఇలానే బలైందని గుర్తు చేస్తున్నారు.