టెస్ట్, టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేల నుంచి కూడా తప్పుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో దుమ్మురేపడంతో ఈ సీనియర్ ఆటగాళ్లు భారత జట్టులో కొనసాగడంపై సందేహాలు మొదలయ్యాయి. కెప్టెన్ శుభ్మన్ గిల్ తన తొలి సిరీస్లోనే సత్తా చూపించడంతో రోహిత్ శర్మ అవసరం లేదనే అభిప్రాయం కలుగుతోంది.
అంతేకాకుండా 2027 నవంబర్లో జరిగే వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టును సిద్దం చేయాల్సి ఉంది. ఈ ప్రపంచకప్ ఆడి గెలవడమే తమ లక్ష్యమని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చెప్పారు. కానీ అప్పటికీ కోహ్లీ వయసు 38 ఏళ్లకు చేరనుండగా.. రోహిత్ శర్మ 40వ ఏట అడుగుపెట్టనున్నాడు.

కేవలం వన్డే ఫార్మాట్, ఐపీఎల్ ఆడుతూ మునపటి ఫామ్ను కొనసాగించడం సాధ్యమవుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా ఈ ఇద్దరు సీనియర్లను జట్టులో కొనసాగించేందుకు గంభీర్ అంగీకరిస్తాడా? అసలే జట్టుపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న గంభీర్.. వన్డే ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా జట్టును సంసిద్దం చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతుంది.
ఇప్పటికే అతను హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టులో చాలా మార్పులు చేశాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్ భవితవ్యంపై వారితో మాట్లాడాలనే ఉద్దేశంలో బీసీసీఐ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే వారిని తప్పుకోమని మాత్రం బీసీసీఐ చెప్పదని ఓ అధికారి స్పష్టం చేశారు.
'కోహ్లీ, రోహిత్ భవితవ్యంపై త్వరలో చర్చిస్తాం. ప్రపంచకప్నకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అప్పటికి వారి వయసు పెరుగుతుంది. మెగా టోర్నీకి స్పష్టమైన ప్రణాళికతో సిద్దం కావాల్సి ఉంటుంది. భారత్ చివరిసారిగా 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచింది. ఈ సారి ఎలాగైన గెలవాలనే లక్ష్యంతో ఉంది. ఈ క్రమంలో కొత్త కుర్రాళ్లను జట్టులోకి తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే రోహిత్, కోహ్లీలను జట్టు నుంచి తప్పుకోవాలని అయితే ఒత్తిడి చేయదు. కానీ మానసికంగా, శారీరకంగా ఆ ఇద్దరి పరిస్థితేంటో తెలుసుకోవడం కోసం వచ్చే వన్డే సైకిల్ మొదలు కావడానికి ముందు వాళ్లతో ప్రొఫెషనల్గా మాట్లాడే అవకాశం ఉంది. వారి భవితవ్యం ఆ మీటింగ్పైనే ఆధారపడి ఉంటుంది.'అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.
కోహ్లీ, రోహిత్ ఈ ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియా పర్యటనలో జరిగే మూడు వన్డేల సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఆ తర్వాత నవంబర్లో సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్లో బరిలోకి దిగుతారు. ఈ రెండు సిరీస్ల్లో రాణిస్తే జట్టులో కొనసాగుతారు. లేదంటే ఈ స్టార్లకు ఉద్వాసన తప్పదు.