హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో నిధుల దుర్వినియోగంతో పాటు అనేక అంశాల్లో నిబంధనలను ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాలని బీసీసీఐని అంబుడ్స్మన్ జస్టిస్ అరుణ్ మిశ్రా ఆదేశించారు. అంబుడ్స్మన్ ఆదేశాలు, సిఫార్సులను పాటించడంలో విఫలమైన హెచ్సీఏపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెలిచాల ఆగం రావు ఫిర్యాదు మేరకు జస్టిస్ మిశ్రా.. ఈ ఉత్తర్వులను జారీ చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి హెచ్సీఏ ఖర్చు చేయాలంటూ 2018, 2021లో బీసీసీఐ ఆదేశించినా.. హెచ్సీఏ పట్టించుకోలేదని ఆగం రావు ఫిర్యాదులో పేర్కొన్నారు.

'బీసీసీఐ, అంబుడ్స్మన్ ఆదేశాల్ని హెచ్సీఏ అమలు చేసేలా బీసీసీఐకి సూచించాలి. బీసీసీఐ నిధులు తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి హెచ్సీఏ ఖర్చు చేయాలి. జిల్లాల్లో శిక్షణ, టోర్నీల నిర్వహణ, మౌలిక వసతుల కల్పనకు నిధులను కేటాయించాలి. ఇందుకోసం బీసీసీఐ ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. జిల్లాల్లో అందే సేవలపై క్రమం తప్పకుండా బీసీసీఐ ఆడిట్ చేయాలి. అప్పుడే దేశానికి ఆడాలన్న గ్రామీణ క్రికెటర్ల కల సాధ్యమవుతోంది.'అని ఆగం రావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అంబుడ్స్మన్.. జస్టిస్ అరుణ్ మిశ్రా.. నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని బీసీసీఐ ఎపెక్స్ కౌన్సిల్ను ఆదేశించారు.
ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో హెచ్సీఏకు విబేధాలు తలెత్తడం తీవ్ర చర్చనీయాంశమైంది. కాంప్లమెంటరీ పాసుల విషయంలో చోటు చేసుకున్న ఈ వివాదంపై సన్రైజర్స్ ఘాటుగా స్పందించడం.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవడంతో హెచ్సీఏ పరువు బజారునపడింది. దిద్దుబాటు చర్యలు చేపట్టిన హెచ్సీఏ.. సన్రైజర్స్ మేనేజ్మెంట్తో చర్చలు జరిపి ఈ వివాదానికి ముగింపు పలికినా.. తాజా అంబుడ్స్మన్ ఆదేశాలు మరోసారి హెచ్సీఏ ప్రతిష్టను దెబ్బతీసాయి.