
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి అడ్డుకునేందుకు దేశంలో విధించిన లాక్డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. కరోనా ప్రభావిత ప్రాంతాలను గ్రీన్, ఆరేంజ్, రెడ్ జోన్లుగా విధించిన భారత ప్రభుత్వం.. గ్రీన్, ఆరేంజ్ జోన్లో నిబంధనలు పాటిస్తూ అన్ని కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని సూచించింది. వైన్ షాప్లకు అనుమతించింది.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ సమాలోచనలు చేస్తుందని వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఇవన్నీ గాలి వార్తలేనని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఐపీఎల్ గురించి ఆలోచించడం లేదని, ఒక్కసారి పరిస్థితులన్నీ సర్దుకున్నాక ఐపీఎల్ నిర్వహణ గురించి ఆలోచిస్తామని తెలిపారు.
'ప్రస్తుతానికైతే ఐపీఎల్ నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్ను ప్రారంభించాలంటే విదేశీ క్రికెటర్లు రావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. వచ్చినా ఆటగాళ్లను రెండు వారాలపాటు క్వారంటైన్లో ఉంచాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఎంతమంది ఆటగాళ్లు దీనికి అంగీకరిస్తారో తెలియదు. ఇలాంటి పరిస్థితిల్లో ఐపీఎల్పై మేం ఎలా ఆలోచిస్తాం. ఈ వార్తలన్నీ మీడియా సృష్టినే. పరిస్థితులన్నీ అదుపులోకి వచ్చిన తర్వాతే ఐపీఎల్ నిర్వహణపై ఆలోచిస్తాం'అని తెలిపారు.
ఈ ఏడాది చివర్లో జరిగే ఆస్ట్రేలియా పర్యటనలో నిబంధనల మేరకు భారత ఆటగాళ్లు రెండువారాలపాటు క్వారంటైన్లో ఉండటానికి సిద్ధమని ధుమాల్ తెలిపారు. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ ఇప్పటివరకు 12 ఎడిషన్లపాటు నాన్స్టాప్గా నిర్వహించారు. మధ్యలో రెండుసార్లు వివిధ కారణాలతో విదేశీగడ్డపైన టోర్నీని నిర్వహించినా, ఎప్పుడూ వాయిదా వేయలేదు. ఈ సారి మాత్రం కరోనా వైరస్ కారణంగా టోర్నీ నిరవధికంగా వాయిదా పడింది.