
న్యూఢిల్లీ: సౌతాఫ్రికా పర్యటనలోని మూడు వన్డేల సిరీస్కు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరం కానున్నాడని వస్తున్న వార్తల్లో నిజం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పష్టం చేసింది. ఇవన్నీ ఉహాగానాలేనని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కావాలని విరాట్ కోహ్లీ అధికారికంగా తమను కోరలేదన్నారు.
'వన్డే సిరీస్ నుంచి తప్పుకొంటున్నట్లు విరాట్ కోహ్లీ అధికారికంగా చెప్పలేదు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి లేదా సెక్రటరీ జై షాకు సమాచారం అందించలేదు. టెస్టు సిరీస్ అనంతరం అతను గాయం కారణంగా లేదా వ్యక్తిగత కారణాల వల్ల వన్డే సిరీస్కు దూరమైతే అది భిన్నమైన అంశం."అని సదరు అధికారి హిందూస్తాన్ టైమ్స్కు తెలిపాడు.
ప్రస్తుతం తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం విరాట్ జనవరి 19, 21, 23న జరగనున్న వన్డేల్లో ఆడతాడని ఆ అధికారి చెప్పుకొచ్చారు. క్రికెటర్లు తమ కుటుంబసభ్యులతో సహా సౌతాఫ్రికా పర్యటనకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. "దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం కూడా భారత క్రికెటర్లు బయోబబుల్లో ఉండాల్సి ఉంటుంది. శ్రీలంక జట్టు భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో క్రికెటర్లు మూడు వారాల పాటు బబుల్లో ఉండనున్నారు. బబుల్తో విసిగిపోతే అతను విశ్రాంతి తీసుకోవచ్చు. అయితే ఏ విషయమైనా సెక్రటరీ జైషాతో పాటు సెలెక్షన్ కమిటీకి చెప్పాల్సి ఉంటుంది" అని ఆ అధికారి తెలిపారు.
ఇక వామికా ఫస్ట్ బర్త్డే సెలెబ్రేషన్స్ కోసం టెస్ట్ సిరీస్ అనంతరం ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసిన కోహ్లీ.. వన్డే సిరీస్కు దూరంగా ఉంటానని బీసీసీఐకి సమాచారమిచ్చినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. దాంతో కోహ్లీ కావాలనే వన్డే సిరీస్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాడని, కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో బీసీసీఐపై ఆగ్రహంగా ఉన్నాడనే ప్రచారం జోరందుకుంది. అంతేకాకుండా రోహిత్ శర్మతో విభేధాలు తారాస్థాయికి చేరాయని ఉహాగానాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను బీసీసీఐ వర్గాలను కొట్టిపారేసాయి.
డిసెంబర్ 26 నుంచి భారత్, సౌతాఫ్రికా టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. జనవరి 15న కేప్టౌన్ వేదికగా చివరి టెస్టు జరగనుంది. ఈ టెస్టు సిరీస్కు విరాట్ కెప్టెన్సీ బాధ్యతలు వహించనున్నాడు. అనంతరం.. జనవరి 19 నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. అయితే.. ప్రాక్టీస్ సెషన్లో గాయమైన కారణంగా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు సిరీస్కు దూరమయ్యాడు.