
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 తీవ్రత నేపథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ నిర్వహణ కష్టమేనని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కరోనా వైరస్ప్రభావం నుంచి కోలుకొని ప్రపంచం ఎప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటుందో కూడా ప్రస్తుతం అంచనా వేయలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. అలాగే వివిధ దేశాలు తమ సరిహద్దుల ఆంక్షలను పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయని సదరు అధికారి సోమవారం ఓ వార్త సంస్థతో అన్నారు.
'ఇలాంటి పరిస్థితుల్లో అక్టోబర్లో ప్రపంచకప్ ప్రారంభమవడం సాధ్యమయ్యేలా లేదు. ఒకవేళ అక్టోబర్లోగా కరోనా ప్రభావం తగ్గినా.. వెంటనే అంతర్జాతీయ ప్రయాణాలు చేసేందుకు సురక్షితమైన పరిస్థితులు ఉంటాయా? అంత త్వరగా మళ్లీ వేలాది మంది ఒకేచోట చేరడంపై కూడా ఆలోచించాల్సి వస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆస్ట్రేలియా ప్రభుత్వం అంత రిస్క్ తీసుకునే అవకాశం చాలా తక్కువ. మిగిలిన దేశాల బోర్డులు సైతం తమ ఆటగాళ్లను పంపేందుకు సిద్ధమవుతాయో లేదో. ముఖ్యంగా ఆ దేశ ప్రభుత్వాలు వారు ప్రయాణించేందుకు అనుమతించాలి కదా. మొత్తంగా ఇంతటి కఠినమైన పరిస్థితుల్లో షెడ్యూల్ ప్రకారం టీ20 ప్రపంచకప్ జరుగడం కష్టమే" అని ఆ అధికారి చెప్పారు.
షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు ఆస్ట్రేలియా వేదికగా ప్రపంచకప్ జరగాల్సి ఉంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు దేశ సరిహద్దులను మూసివేస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఐసీసీ మాత్రం కరోనా తీవ్రత ఇంకా తగ్గకపోయినా టీ20 ప్రపంచకప్ను నిర్వహించే విషయంలో ఆశాభావంతోనే ఉంది.
షెడ్యూల్ ప్రకారమే పొట్టి ప్రపంచకప్ను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పుచేర్పులు లేవని ఐసీసీ ప్రకటించింది. 12 మంది శాశ్వత సభ్య దేశాలు, 3 అసోసియేట్ బోర్డులకు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్లతో గత గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐసీసీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. కరోనా నేపథ్యంలో క్రికెట్ను మళ్లీ దారిలో పెట్టేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవడంపై ఈ భేటీలో చర్చించింది.