న్యూఢిల్లీ: భారత క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ 2020 సీజన్కు ఆతిథ్యమిచ్చేందుకు మరో దేశం ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఏఈ, శ్రీలంక దేశాలు మెగాలీగ్కు ఆతిథ్యమిచ్చేందుకు సిద్దమని ప్రకటించగా.. తాజాగా ఈ జాబితాలో న్యూజిలాండ్ కూడా చేరింది. ఈ విషయాన్ని సోమవారం బీసీసీఐ వర్గాలే స్పష్టం చేశాయి. భారత్ వేదికగా నిర్వహించేందుకే తమ తొలి ప్రాధాన్యత అని తెలిపిన ఓ బీసీసీఐ అధికారి.. న్యూజిలాండ్ కూడా ఆతిథ్యమిచ్చేందుకు సిద్దమని ప్రకటించిందన్నారు.
'భారత్ వేదికగా ఐపీఎల్ను నిర్వహించడమే మా మొదటి ప్రాధాన్యత. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ టోర్నీ నిర్వహించడం చాలా కష్టంగా కనిపిస్తోంది. కాబట్టి.. విదేశాల్లో టోర్నీ నిర్వహణకి ఉన్న అనువైన మార్గాల్ని పరిశీలిస్తున్నాం. ఐపీఎల్కి ఆతిథ్యమిచ్చేందుకు ఇప్పటికే యూఏఈ, శ్రీలంక ముందుకిరాగా.. తాజాగా న్యూజిలాండ్ కూడా ఆ జాబితాలో చేరింది'ఆ అధికారి మీడియాకు తెలిపారు.
ఇక ఐపీఎల్ 2020 సీజన్కి సంబంధించిన షెడ్యూల్పై బీసీసీఐ ముళ్లగుల్లాలు పడుతోంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ ప్రారంభంకావాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ఆ టోర్నీని తొలుత ఏప్రిల్ 15కు వాయిదా వేసిన బీసీసీఐ ఆ తర్వాత నిరవధికంగా వాయిదా వేసేసింది. దాంతో.. ఇప్పుడు అక్టోబరు- నవంబరులో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 వరల్డ్కప్ వాయిదాపడితే.. ఆ విండోలో ఐపీఎల్ని నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో విదేశాల్లో నిర్వహిస్తే ఎలా ఉంటుందనేదానిపై కూడా సమాలోచనలు చేస్తుంది.
ఇక భారత్లో సార్వత్రిక ఎన్నికల కారణంగా 2009లో దక్షిణాఫ్రికా గడ్డపై ఐపీఎల్ మ్యాచ్లు జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2014 ఎన్నికల సమయంలోనూ కొన్ని మ్యాచ్లకు యూఏఈ ఆతిథ్యమిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని మరోసారి ఐపీఎల్ ఆతిథ్య అవకాశం ఇవ్వాలని యూఏఈ కోరుతుండగా.. శ్రీలంక తమ దేశంలో కరోనా వైరస్ కేసులు తక్కువగా నమోదవడంతో.. ఎలాంటి ఆటంకాలు లేకుండా టోర్నీని నిర్వహిస్తామని హామీ ఇస్తోంది. అయితే తాజాగా న్యూజిలాండ్ కూడా నిర్వహిస్తామని ప్రకటించింది. ఇటీవల ఆ దేశంలో 'జీరో కరోనా కేసుల' సెలబ్రేషన్స్ కూడా జరిగిన విషయం తెలిసిందే.
ధోనీ కెప్టెన్సీని మాటల్లో వర్ణించలేం.. చిన్న పట్టణం నుంచి వచ్చి ఎంతో సాధించాడు: పాక్ మాజీ క్రికెటర్