సుమారు 40 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా తిరిగి బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్తో రెండు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం రోహిత్ శర్మ సారథ్యంలోని 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.
ఇప్పటికే భారత ఆటగాళ్లు చెన్నై వేదికగా ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు. తొలి టెస్ట్ విజయమే లక్ష్యంగా సన్నదమవుతున్నారు. నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సారథ్యంలోని టీమిండియా మేనేజ్మెంట్ ఈ మ్యాచ్ గెలవడానికి కావాల్సిన వ్యూహాలు రచిస్తోంది.

బీసీసీఐ మాత్రం కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి జరిగే రెండో టెస్టుకు, అక్టోబర్ 6 నుంచి మొదలయ్యే టీ20 సిరీస్కు ఒకేసారి భారత జట్లను ప్రకటించాలని యోచిస్తోంది. అయితే బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్లకు విశ్రాంతి ఇవ్వాలని భారత సెలెక్టర్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచనల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే నాలుగు నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. వచ్చే ఏడాది ఏకంగా 16 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ క్రమంలోనే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్లను టీ20 ఫార్మాట్కు దూరంగా ఉంచాలని గంభీర్ భావిస్తున్నాడట.
ఛాంపియన్స్ ట్రోఫీ ముందు వరకు వారిని టెస్ట్ ఫార్మాట్కు పరిమితం చేయాలని, వారి స్థానాల్లో కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సెలెక్టర్లకు సూచించినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ విజయానంతరం జస్ప్రీత్ బుమ్రా ఇంటికే పరిమితమయ్యాడు. మరోవైపు సిరాజ్.. శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్ ఆడాడు.
బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ అనంతరం భారత్ న్యూజిలాండ్తో పాటు ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. ఈ సిరీస్లకు సిరాజ్, బుమ్రాలను ఫ్రెష్గా ఉంచేందుకు వారిని టీ20 సిరీస్లకు దూరంగా ఉంచాలని నిర్ణయించారని టీమ్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ కూడా బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు దూరంగా ఉంచాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
బంగ్లాదేశ్ టీ20 సిరీస్కు గిల్తో పాటు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్లకు కూడా విశ్రాంతి ఇవ్వనున్నట్లు ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపాడు. ఈ ముగ్గురితో పాటు రిషభ్ పంత్కు కూడా రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ పంత్కు విశ్రాంతి ఇస్తే ఇషాన్ కిషన్ తిరిగి భారత జట్టులోకి వస్తాడు.
'బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు శుభ్మన్ గిల్కు విశ్రాంతి ఇస్తున్నాం. ఇందుకు భారత్-బంగ్లాదేశ్ టీ20 సిరీస్ షెడ్యూలే కారణం. అక్టోబర్ 7న గ్వాలియర్లో, 10న ఢిల్లీలో, 13న హైదరాబాద్లో మ్యాచ్లు ఉన్నాయి. మరో మూడు రోజుల వ్యవధిలోనే అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. కాబట్టి శుభ్మన్ గిల్తో పాటు ప్రధాన ఆటగాళ్లందరికి విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం'అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.