భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్లపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగుతోంది. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్కు ప్రాధాన్యం ఇవ్వని టీమిండియా స్టార్ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లపై బీసీసీఐ కఠిన చర్యలను తీసుకోవడాన్ని కొందరు అభిమానులు, మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు.
రంజీ ట్రోఫీ ఆడాలనే బోర్డు ఆదేశాలను బేఖాతరు చేసినందుకు బీసీసీఐ వారి కాంట్రాక్ట్లను తొలగించిన విషయం తెలిసిందే. గతేడాది గ్రేడ్ సీ కాంట్రాక్ట్లో ఉన్న ఇషాన్ కిషన్.. గ్రేడ్ బీ కాంట్రాక్ట్లో ఉన్న శ్రేయస్ అయ్యర్లకు ఈ సారి ఎలాంటి కాంట్రాక్ట్ దక్కలేదు. ఈ ఏడాదికి సంబంధించిన వార్షిక కాంట్రాక్ట్ల కోసం శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లను పరిగణలోకి తీసుకోలేదని బీసీసీఐ తమ ప్రకటనలో స్పష్టం చేసింది.

ప్రతీ ఆటగాడు దేశవాళీ క్రికెట్కు ప్రాధాన్యం ఇవ్వాలని, జాతీయ జట్టుకు దూరంగా ఉండి.. ఫిట్గా ఉంటే తప్పకుండా తమ దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించింది. అయితే దేశవాళీ క్రికెట్ ఆడలేదని శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లపై మాత్రమే చర్యలు తీసుకోవడాన్ని మాజీ క్రికెటర్లు, అభిమానులు తప్పుబట్టారు.
2018 నుంచి దేశవాళీ క్రికెట్ ఆడని హార్దిక్ పాండ్యా గ్రేడ్ ఏ కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పైగా హార్దిక్ పాండ్యా వన్డే ప్రపంచకప్ మధ్యలోనే జట్టుకు దూరమయ్యాడని, చాలా టోర్నీలు ఆడలేదని గుర్తు చేశారు. అలాంటి హార్దిక్ పాండ్యాకు గ్రేడ్ ఏ కాంట్రాక్ట్ ఇచ్చి.. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లపై వేటు వేయడం బీసీసీఐ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.
మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం ఇదే విషయంపై బీసీసీఐని సోషల్ మీడియా వేదికగా నిలదీసాడు. హార్దిక్ పాండ్యా దేశవాళీలో వైట్బాల్ క్రికెట్ అయినా ఆడాల్సిందని అభిప్రాయపడ్డాడు. రూల్స్ అందరికి వర్తింపజేయాలని లేకుంటే ఆశించిన ఫలితాలు దక్కవని చురకలంటించాడు. ఈ వ్యవహారం నేపథ్యంలో హార్దిక్ పాండ్యాకు గ్రేడ్ ఏ కాంట్రాక్ట్ ఇవ్వడంపై బీసీసీఐ వర్గాలు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాయి.

ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ లేనప్పుడు దేశవాళీ మ్యాచ్లు ఆడుతానని హార్దిక్ పాండ్యా బీసీసీఐకి మాటిచ్చాడని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే అతనికి గ్రేడ్ ఏ కాంట్రాక్ట్ ఇచ్చారని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. కానీ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లు టీమ్మేనేజ్మెంట్తో పాటు బీసీసీఐ ఆదేశాలను పట్టించుకోలేదని, అందుకే వారిపై చర్యలు తీసుకున్నారని సదరు అధికారి వెల్లడించారు.
'దేశవాళీ క్రికెట్ ఆడే విషయంపై హార్దిక్ పాండ్యాతో మేం చర్చించాం. వైట్ బాల్ టోర్నీలు ఆడే విషయంపై అతను మాకు మాటిచ్చాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ అతను రెడ్ బాల్ క్రికెట్ ఆడలేడని రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి హార్దిక్ పాండ్యాకు రంజీ ట్రోఫీ ఆడాలనే రూల్ వర్తించదు. కానీ అతను దేశవాళీ వైట్బాల్ టోర్నీలు ఆడాలి. ఖాళీగా ఉండి దేశవాళీ టోర్నీలు ఆడకపోతే అతను కూడా కాంట్రాక్ట్ను కోల్పోతాడు.'అని సదరు బీసీసీఐ అధికారి చెప్పుకొచ్చాడు.
వన్డే ప్రపంచకప్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో బంతిని కాలుతో ఆపే క్రమంలో హార్దిక్ పాండ్యా చీల మండకు తీవ్రంగా గాయమైంది. దాంతో అతను భారత జట్టుకు దూరమయ్యాడు.