
న్యూఢిల్లీ: కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సమయంలో తనకు ఎవరూ అండగా నిలవలేదని, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కడే మెసేజ్ చేశాడని విరాట్ కోహ్లీ చేసిన సంచలన వ్యాఖ్యలపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు. విరాట్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నాడు. బోర్డు నుంచి అతనికి పూర్తి మద్దతు లభించిందని, జట్టులోని ఆటగాళ్లు సైతం అండగా నిలిచారని చెప్పాడు.
ఇంగ్లండ్లో దారుణంగా విఫలమైన విరాట్ కోహ్లీ ఆ పర్యటన అనంతరం సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. దాదాపు నెలరోజుల పాటు ఆటకు దూరంగా ఉండి ఫ్యామిలీతో గడిపాడు. మళ్లీ ఆసియాకప్ 2022 టోర్నీతోనే ఆటను మొదలుపెట్టాడు. పాకిస్థాన్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో 35 పరుగులతో రాణించిన విరాట్ ఆ తర్వాత వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాదాడు. పాకిస్థాన్ ఆదివారం జరిగిన మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
'నేను టెస్ట్ కెప్టెన్సీ వదులకున్నప్పుడు ధోనీ ఒక్కడే మెసేజ్ చేశాడు. అంతేతప్పా మరెవరూ నాకు మెసేజ్ చేయలేదు. నా ఫోన్ నెంబర్ ఉన్న చాలా మంది, నా అత్యంత సన్నిహితులు కూడా నాకు అండగా నిలవలేదు. టీవీల్లో నాగురించి మాట్లాడుతూ.. సలహాలిచ్చేవారు కూడా మెసేజ్ చేయలేదు'అని తెలిపాడు.
ఈ వ్యాఖ్యలను బీసీసీఐకి చెందిన ఓ అధికారి ఖండించాడు. 'విరాట్ కోహ్లీకి ప్రతీ ఒక్కరు అండగా నిలిచారు. అతని సహచరులతో పాటు బీసీసీఐలోని ప్రతీ అధికారి మద్దతుగా ఉన్నారు. సపోర్ట్ ఇవ్వలేదని కోహ్లీ చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదు. అతనికి తరుచూ రెస్ట్ ఇచ్చారు. టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు బీసీసీఐలోని ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా వేదికగా అభినందించారు.'అని సదరు అధికారి తెలిపాడు.