ఆర్థిక లాభం కోసం తరుచూ భారత్, పాకిస్థాన్ మ్యాచ్లు నిర్వహించవద్దని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ చేసిన వ్యాఖ్యలను బీసీసీఐ కౌంటరిచ్చింది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ లేకుండా టోర్నీలు నిర్వహించడం అంత సులువు కాదని, బ్రాడ్కాస్టర్స్, స్పాన్సర్స్ ఆసక్తి కనబర్చరని ఓ బీసీసీఐ ప్రతినిధి తెలిపాడు. మాట్లాడినంత ఈజీగా టోర్నీలు నిర్వహించలేమన్నాడు.
ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య తరుచూ ఐసీసీ, ఏసీసీ ఈవెంట్స్లో మ్యాచ్లో జరిగేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. తద్వారా ఆర్థికంగా లాభం వస్తుందని, బ్రాడ్కాస్టింగ్ రూపంలో కోట్ల రూపాయాలు వస్తాయని క్రికెట్ బోర్డులు, ఐసీసీ భావించి ఇలా చేస్తోంది. 2023 27 సైకిల్లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ల బ్రాడ్కాస్టింగ్ విలువ సుమారుగా 3 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మైఖేల్ అథర్టన్ విమర్శలు గుప్పించాడు.

ఇక నుంచి ఐసీసీ టోర్నీల డ్రాను బహిరంగంగా తీయాలని డిమాండ్ చేశాడు. ఒకప్పుడు క్రికెట్ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు వారధిగా ఉండేదని, కానీ ఇప్పుడు అది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు, రాజకీయ ప్రచారానికి ప్రతిరూపంగా మారిందన్నాడు. ఆర్థిక అవసరాల కోసం ఒక టోర్నీనీ, మ్యాచ్లను నిర్వహించడం సరికాదని, ఆట స్ఫూర్తి కూడా ముఖ్యమని చెప్పాడు.
ఈ కామెంట్స్ను బీసీసీఐ అధికారి ఒకరు తప్పుబట్టారు. 'ఇవన్నీ మాట్లాడటం చాలా సులువు. కానీ స్పాన్సర్లు , బ్రాడ్కాస్టర్ ఇందుకు అంగీకరిస్తారా? ప్రస్తుత పరిస్థితుల్లో ఒక జట్టు తప్పుకుంటేనే స్పాన్సర్లను ఆకర్షించడం కష్టంగా మారింది. అలాంటి భారత్, పాక్ మ్యాచ్ లేకుండా టోర్నీలను నిర్వహించాలంటే స్పాన్సర్లు ముందుకు వస్తారా? బ్రాడ్ కాస్టర్స్, స్పాన్సర్స్ను కాదని ఐసీసీ, బీసీసీఐ నిర్ణయం తీసుకోలేవు 'అని సదరు అధికారి అన్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న వైరం ఐసీసీ, బీసీసీఐకి ఆదాయ మార్గంగా మారిపోయిందని సదరు అధికారి పరోక్షంగా అంగీకరించాడు.