న్యూజిలాండ్తో తొలి వన్డేలో గాయపడిన వాషింగ్టన్ సుందర్ మిగిలిన రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సోమవారం అధికారికంగా ప్రకటించింది. అతని స్థానంలో ఆశ్చర్యకరంగా ఢిల్లీ యువ ఆటగాడైన ఆయుష్ బదోనిని ఎంపిక చేసింది. షెహ్బాజ్ అహ్మద్కు అవకాశం దక్కుతుందని అంతా భావించగా.. సెలెక్టర్లు మాత్రం ఆయుష్ బదోనిని ఎంపిక చేశారు. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున బరిలోకి దిగే ఆయుష్ బదోని అభిమానులకు సుపరిచితమే.
'న్యూజిలాండ్తో తొలి వన్డేలో బౌలింగ్ సందర్భంగా పక్కటెముకల కింది భాగంలో నొప్పి వస్తుందని భారత ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ మెడికల్ టీమ్కు తెలియజేశాడు. మ్యాచ్ అనంతరం అతనికి స్కానింగ్ తీసారు. ఎక్స్పర్ట్స్ అభిప్రాయం కోసం బీసీసీ మెడికల్ టీమ్ వేచి చూస్తుంది. ఈ వన్డే సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్లకు సుందర్ దూరమయ్యాడు. అతని స్థానంలో ఆయుష్ బదోనిని భారత పురుషుల సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. రెండో వన్డే జరిగే రాజ్కోట్లో బదోని భారత జట్టుతో కలవనున్నాడు.'అని బీసీసీఐ తమ ప్రకటనలో పేర్కొంది.
తొలి వన్డేలో సుందర్ ఐదు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 5.40 ఎకానమీతో 27 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాటింగ్కు వచ్చిన సుందర్.. కేఎల్ రాహుల్కు అండగా నిలిచాడు. 7 పరుగులతో అజేయంగా నిలిచాడు.

సుందర్ స్థానంలో ఆయుష్ బదోనిని ఎంపిక చేయడంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గంభీర్ సూచనలతోనే బదోనిని సెలెక్టర్లు ఎంపిక చేశారనే వాదన వినిపిస్తోంది. గతంలో బదోనిని గంభీరే ఐపీఎల్కు పరిచయం చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్కు మెంటార్గా ఉన్న సమయంలో ఈ ఢిల్లీ ఆటగాడిని వేలంలో కొనుగోలు చేయడంతో పాటు తుది జట్టులో ఆడించాడు. ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేసిన బదోని.. దేశవాళీ క్రికెట్లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. బదోని బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు. అయితే ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో అతను పెద్దగా రాణించలేదు. 4 మ్యాచ్లు ఆడి 16 పరుగులే చేశాడు. బౌలింగ్లో 4 వికెట్లు మాత్రమే తీసాడు.
శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.