ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. బబుల్లోకి చొచ్చుకొచ్చిన వైరస్ వేగంగా ఆటగాళ్లకు సోకడంతో బీసీసీఐ లీగ్ను నిరవధికంగా వాయిదా వేసింది. మళ్లీ నిర్వహించే విషయంపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ఆటగాళ్లంతా తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. అయితే వచ్చే నెలలో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్పై అందరి దృష్టి నెలకొంది.
ఈ పర్యటన కోసం భారత సెలెక్టర్లు శుక్రవారమే 20 మంది కూడిన జంబో జట్టును ప్రకటించారు. జూన్ 18న మొదలయ్యే వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో న్యూజిలాండ్తో కోహ్లీసేన పోటీ పడుతుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు జరిగే ఐదు టెస్ట్ల సిరీస్లో ఇంగ్లండ్తో తలపడుతుంది. క్వారంటైన్ రూల్స్ నేపథ్యంలో ఈ నెల మూడో వారంలోనే టీమిండియా.. యూకే బయల్దేరే చాన్స్ ఉంది.
అయితే ఇంగ్లండ్లో అడుగు పెట్టిన తర్వాత నిబంధనల ప్రకారం భారత జట్టు రెండు వారాల తప్పనిసరిగా కఠిన క్వారంటైన్లో ఉండాల్సిందే. దీని ప్రకారం ఎవరూ సహచర ఆటగాళ్లను కూడా కలవరాదు. అయితే ఈ విషయంలో ఏదైనా సడలింపులు కోరాలని బీసీసీఐ భావిస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు సిడ్నీలో టీమిండియా సభ్యులు క్వారంటైన్లో ఉన్నా కలిసి ఆడుకునేందుకు అనుమతినిచ్చారు. ఇంగ్లండ్లో ఒక వారం మాత్రమే క్వారంటైన్ ఉండేలా అనుమతించాలని బోర్డు కోరనుంది.
దానికంటే ముందు భారత్లోనే ఒక వారం రోజుల పాటు 'ప్రత్యేక బయో బబుల్' ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. ఎలాగూ విమానాలు లేవు కాబట్టి క్రికెటర్లంతా ప్రత్యేక విమానంలోనే వెళ్లాల్సి ఉంది. అలాంటప్పుడు ఇక్కడి బబుల్ నుంచి మరో బబుల్లోకి మారడం సులువవుతుంది. ఆటగాళ్లకు దీనివల్ల కొంత అదనపు సమయం లభిస్తుందని బీసీసీఐ చెబుతోంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండటంతో పాటు ఐపీఎల్ బబుల్ బద్దలైన తీరు చూస్తే బీసీసీఐకి అంత సులువుగా అనుమతి లభించకపోవచ్చు.