
డిసెంబర్ 16న మినీ వేలం..
ఇక ఐపీఎల్ 2023 కోసం మినీ వేలం నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. ఓ బీసీసీఐ అధికారి తెలిపిన వివరాల ప్రకారం అన్ని అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ 16న ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. ఈ మేరకు బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్.. బోర్డు సర్వసభ్య సమావేశంలో చర్చలు జరుపనున్నారు. అయితే వేలం తేదీని బీసీసీఐ ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు. వేలంతో పాటు ఈసారి ప్రతీ ఫ్రాంచైజీ పర్స్ బ్యాలెన్స్ ను రూ. 95 కోట్లుగా నిర్ణయించనున్నారు. గత వేలంలో ఇది రూ. 90 కోట్లుగా ఉంది. రాబోయే సీజన్ కు రూ. 5 కోట్లు పెరగనుంది. 2024 (ఐపీఎల్-17) లో దీనిని వంద కోట్లకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏజీఎంలో డిస్కషన్..
మరికొద్దిరోజుల్లోనే బీసీసీఐ వార్షిక సమావేశం (ఏజీఎం) జరగాల్సి ఉంది. ఈ సమావేశంలో మినీ వేలం తేదితో పాటు వేదికను కూడా ఖరారు చేయనున్నారు. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. 'ఇది మినీ వేలం. గతేడాది నిర్వహించిందే మెగా వేలం. తర్వాత వచ్చే మూడేళ్లు మినీ వేలాలే జరుగుతాయి. ఫ్రాంచైజీలు తమ జట్లలో సర్దుబాట్లు చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ ఏడాది వేలం ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఏజీఎం తర్వాత తెలుస్తాయి.' అని చెప్పారు.

జడేజా మాతోనే..
ఇప్పటికే ఫ్రాంచైజీల ట్రేడింగ్ విండో ఓపెన్ అయ్యింది. మినీ వేలం వరకు ఫ్రాంచైజీలకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండనుంది. ఇక రవీంద్ర జడేజా కోసం ఫ్రాంచైజీలన్నీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం జడేజాను వదులకునేందుకు సిద్దంగా లేమని స్పష్టం చేసింది. ఒకవేళ జడేజా మినీ వేలంలోకి వస్తే మాత్రం భారీ ధర పలకనున్నాడు. గత కొద్దిరోజులుగా జడేజా-సీఎస్కే మధ్య విభేదాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్-2022లో అతనికి సారథ్యం కట్టబెట్టి మధ్యలోనే దాన్నుంచి తొలగించడంతో జడ్డూ కోపంగా ఉన్నాడని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications
