
న్యూఢిల్లీ: కరోనా బ్రేక్ తర్వాత టీమిండియా ఆడే తొలి అంతర్జాతీయ సిరీస్ అయిన ఆస్ట్రేలియా పర్యటనకు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను పంపించాలా? వద్దా? అనేదానిపై ఆదివారం తుది నిర్ణయం తీసుకుంటామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తెలిపింది. రెండు నెలల పాటు సాగే ఈ సుదీర్ఘ పర్యటనకు తొడకండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మను ఒక్క ఫార్మాట్కు కూడా ఎంపిక చేయని విషయం తెలిసిందే.
రోహిత్ వేటుపై బీసీసీఐ క్లారిటీ ఇవ్వకపోవడం.. అటు ముంబై ఇండియన్స్ గాయం తీవ్రతపై క్లారిటీ ఇవ్వకపోవడంతో టీమ్ సెలెక్షన్ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగింది. దానికితోడు రోహిత్ ప్రాక్టీస్ సెషన్ వీడియోను ముంబై ఇండియన్స్ ట్వీట్ చేయడం ఈ వివాదానికి మరింత అగ్గిని రాజేసింది. మాజీ క్రికెటర్లు, అభిమానులు బీసీసీఐపై దుమ్మెత్తిపోసారు. దాంతో దిద్దుబాటు చర్యలకు దిగిన బీసీసీఐ.. టీమిండియా ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్ ఇచ్చిన రిపోర్ట్ కారణంగానే భారత సెలక్టర్లు రోహిత్ ఎంపిక చేయలేదని ప్రకటించింది.
ఆ క్రమంలోనే తాజాగా బీసీసీఐ మెడికల్ టీమ్ రోహిత్ శర్మ గాయాన్ని ఆదివారం పరీశిలించనుందని తెలిపింది. గాయం తీవ్రతను బట్టి ఆసీస్కు పంపించాలా? వద్దా అనేదానిపై తుది నిర్ణయంతీసుకుంటామని స్పష్టం చేసింది. 'రోహిత్ శర్మ గాయాన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ ఆదివారం పరిశీలిస్తుంది. అతను ఆసీస్ పర్యటకు వెళ్లే పరిస్థితుల్లో ఉన్నాడా? లేక మరికొద్ది రోజుల విశ్రాంతి అవసరమా? అనేదానిపై ఓ నిర్ణయానికి రానుంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతను పరుగెత్తగలుగుతన్నాడా? అనేది పరీక్షంచనుంది.'అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.
'గ్రేడ్-2 హార్మ్స్ట్రింగ్ ఇంజ్యూరి అయితే సాధారణంగా బ్యాటింగ్ చేయడానికి, నడవడానికి ఎలాంటి సమస్య ఉండదు. కానీ సడన్గా పరుగెత్తినప్పుడు, ముఖ్యంగా వికెట్ల మధ్య పరుగుతీసేటప్పుడు గాయం ఇబ్బంది పెడుతుంది. ఇక వేగంగా పరుగెత్తి ఆగినప్పుడు గాయం తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. శరీర భారమంతా కండరాల పడినప్పుడు ఇలా జరుగుతుంది. కాబట్టి పూర్తిగా కోలుకుంటేనే ఎలాంటి సమస్య ఉండదు. ఆ క్రమంలోనే బీసీసీఐ మెడికల్ టీమ్ రోహిత్ శర్మ గాయాన్ని అంచనా వేయనుంది'అని సదరు అధికారి తెలిపారు.
ఇక ఐపీఎల్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జంబో జట్టు నవంబర్ 12న ఆస్ట్రేలియాకు బయల్దేరనుంది. ఈ టూర్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్ట్ మ్యాచ్లు జరగనున్నాయి.