ఐపీఎల్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ టోర్నీలో టీనేజర్స్ ఆడాలనుకుంటే.. తప్పనిసరిగా ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడి ఉండాలనే రూల్ ప్రవేశ పెట్టింది. ఈ నయా రూల్ ప్రకారం అండర్ 16, అండర్ 19 ప్లేయర్లు ఐపీఎల్కు అర్హత సాధించాలంటే రంజీ ట్రోఫీలో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడి ఉండాలి.
ఆదివారం ముంబై వేదికగా జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రూల్కు సంబంధించి బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఐపీఎల్ 2026 సీజన్ నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ రూల్ అమలైతే.. ఇక మీదట యువ ఆటగాళ్లు నేరుగా ఐపీఎల్లోకి వచ్చే అవకాశం ఉండదు. ఐపీఎల్ వేలంలోకి రిజిస్టర్ చేసుకోవాలన్నా.. వారి తమ రాష్ట్రం తరఫున కనీసం ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్లోనైనా ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. దేశీయ క్రికెట్ను బలోపేతం చేసేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ సమావేశంలోనే బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీసీసీఐ అధ్యక్ష, ఉపాధ్యక్షుడి పదవులతో పాటు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ట్రెజరర్ స్థానాలకు ఒకే ప్యానెల్ నామినేషన్ దాఖలు చేసింది. దాంతో మిథున్ మన్హాస్ అధ్యక్షుడు కాగా.. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్గా రాజీవ్ శుక్లా, సెక్రటరీగా దేవజిత్ సైకియా తిరిగి ఎన్నికయ్యారు.
సంయుక్త కార్యదర్శిగా ప్రభ్ తేజ్ సింగ్ భాటియా, కోశాధికారిగా రఘురామ్ భట్ ఎన్నికైనట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అపెక్స్ కౌన్సిల్లో ఇప్పటి వరకు జయ్దేవ్ నిరంజన్ ఏక సభ్యుడిగా ఉన్నారు. తాజాగా బీసీసీఐ మరో ఇద్దరిని ఎంపిక చేసింది. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధమాల్తో పాటు కైరుల్ జమాల్ మజుందార్ గవర్నింగ్ కౌన్సిల్లోకి వచ్చారు.