న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును పాటించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి ఊహించని షాక్ తగిలింది. మంగళవారం 77వ స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ ప్రజలంతా తమ సోషల్ మీడియా ఖాతాలా ప్రొఫైల్ పిక్గా మువ్వెన్నల జెండాను పెట్టుకోని దేశభక్తి చాటుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
ఈ ఆదేశాలను పాటించిన బీసీసీఐ.. తమ ప్రొఫైల్ పిక్ను మార్చింది. బీసీసీఐ లోగో స్థానంలో భారత జెండాను ఉంచింది. అయితే ఈ మూర్పుతో బీసీసీఐ ట్విటర్ ఖాతా అధికారిక బ్లూ టిక్ వెరిఫికేషన్ను కోల్పోయింది. బీసీసీఐ ఖాతాకు బ్లూటిక్ లేకపోవడంతో అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. అధికారిక అకౌంటా? ఫేక్ అకౌంటా? అనే విషయాన్ని తేల్చుకోలేకపోతున్నారు.

ట్విటర్ వేదికగా ఇటీవల తీసుకొచ్చిన మార్పుల కారణంగానే బీసీసీఐ బ్లూటిక్ కోల్పోయిందని అర్థమవుతోంది. ఇటీవలే ట్విటర్ ఎక్స్గా రూపాంతరం చెందిన విషయం తెలిసిందే. ఈ మార్పు నేపథ్యంలో యూజర్స్కు కొన్ని గైడ్లైన్స్ విధించారు. ఈ నిబంధనల ప్రకారం ప్రొఫైల్ ఫొటోను మార్చితే వెంటనే బ్లూ టిక్ రద్దవుతోంది.
ఆ మార్పును ఎక్స్ మేనేజ్మెంట్ రివ్యూ చేసి బ్లూ టిక్ను పునరుద్దరిస్తోంది. ఈ క్రమంలోనే బీసీసీఐ కూడా డీపీ మార్చి బ్లూ టిక్ కోల్పోయింది. మరి కొద్ది గంటల్లో బీసీసీఐ బ్లూ టిక్ వచ్చే అవకాశం ఉంది. పంద్రాగస్టు వేడుకలు ముగిసిన తర్వాత బీసీసీఐ మరోసారి ప్రొఫైల్ పిక్ మారిస్తే మరోసారి బ్లూ టిక్ కోల్పోనుంది.
బీసీసీఐ అధికారిక ఖాతాతో పాటు బీసీసీఐ డొమెస్టిక్, బీసీసీఐ వుమెన్స్ ఖాతాల ప్రొఫైల్ పిక్స్ కూడా మార్చగా.. బ్లూ టిక్ మాయమైంది. వెస్టిండీస్ పర్యటనను టీమిండియా ఓటమితో ముగించింది. టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా.. టీ20 సిరీస్ను మాత్రం 2-3తో కోల్పోయింది. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్లో పేలవ బ్యాటింగ్తో 8 వికెట్ల తేడాతో చిత్తయ్యింది.
ఈ నెల 18 నుంచి ఐర్లాండ్ గడ్డపై టీమిండియా మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఆసియా కప్ 2023 నేపథ్యంలో ఈ పర్యటనకు సీనియర్ ఆటగాళ్లంతా దూరంగా ఉండనున్నారు. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని తృతీయ శ్రేణి జట్టును ఈ సిరీస్కు ఎంపిక చేశారు.