
భారత్ ఫైనల్ చేరడంతో..
టీమిండియా వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్కు వెళ్లడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను కూడా ఒక వారం ముందే ముగిస్తున్నారు. ఒకవేళ టీమిండియా ఫైనల్కు వెళ్లకుంటే జూన్ రెండో వారంలో శ్రీలంక వేదికగా ఆసియా కప్ టీ20 టోర్నీ నిర్వహించాలని భావించారు. గత సెప్టెంబర్లోనే జరగాల్సిన ఈ టోర్నీ కరోనా కారణంగా వాయిదాపడింది. టీమిండియా తప్పకుండా ఆడాలని భావించిన పాకిస్థాన్ కూడా.. తమ ఆతిథ్యాన్ని శ్రీలంకకు ఇచ్చింది. ఇప్పుడు భారత జట్టు అనూహ్యంగా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరడంతో ఆసియాకప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. జూన్ 18 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్నది. ఆ తర్వాత రెండు వారాలకే ఇంగ్లండ్తో నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనున్నది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత భారత్ అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

టీమిండియా- 2.0...
భారత టెస్ట్ జట్టులో ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ టీ20లు కూడా ఆడుతుంటారు. డబ్ల్యూటీసీ, ఇంగ్లండ్ సిరీస్లో వీళ్లు తప్పకుండా మ్యాచ్లు ఆడాల్సి ఉన్నది. దీంతో ఆసియాకప్ కోసం ఒక టీ20 జట్టును పంపాలని బీసీసీఐ భావిస్తున్నది. శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, యుజువేంద్ర చాహల్, శార్దుల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, నవ్దీప్ సైనీలతో పాటు యువ ఆటగాళ్లు రాహుల్ తెవాటియా, వరుణ్ చక్రవర్తి, నటరాజన్, సూర్యకుమార్ యాదవ్లతో కూడిన జట్టును ఆసియాకప్కు పంపితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న జైషా టెస్ట్లు, టీ20లకు వేర్వేరు జట్లు పంపడం వల్ల ప్రపంచ క్రికెట్కు సానుకూల సంకేతాలు పంపినట్లు ఉంటుందని, బీసీసీఐపై ఇప్పటికే ఉన్న అపవాదులు కూడా తొలగిపోతాయని భావిస్తున్నారు. త్వరలోనే బీసీసీఐ సమావేశంలో రెండు జట్ల సిద్దాంతంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నది.

ఈ విధానం కొత్తేం కాదు..
ఫార్మాట్లకు తగ్గట్లు జట్లను ఎంపిక చేసే పద్దతి కొత్తేం కాదు. ఈ విధానాన్ని ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బోర్డులు ఎప్పటి నుంచో అవలంభిస్తున్నాయి. సుదీర్ఘ, పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు మాత్రమేకాకుండా జట్లు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఆస్ట్రేలియాలో బిగ్బాష్ లీగ్ జరుగుతున్న సమయంలోనే టెస్ట్ మ్యాచ్లు కూడా జరుగుతుంటాయి. ఇక ఇంగ్లండ్ బోర్డు ఇటీవలే రొటేషన్ పద్దతిని తీసుకొచ్చింది. దీంతో ఆటగాళ్లకు విశ్రాంతి దొరకడమే కాకుండా, తమకు ఇష్టమైన ఫార్మాట్లో ఆడే స్వేచ్చ ఉన్నది. కేవలం భారత్ మాత్రమే అన్ని ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ను కొనసాగిస్తున్నది. మరోవైపు జట్టు సభ్యులు కూడా దాదాపు అన్ని ఫార్మాట్లలో వాళ్లే ఉంటారు. దీని వల్ల ఐపీఎల్ జరిగే సమయంలో మరే విధమైన మ్యాచ్లు నిర్వహించడం లేదు. ఈ రెండు జట్ల సిద్దాంతం సక్సెస్ అయితే భవిష్యత్తులో భారత్ ఒకే సమయంలో రెండు సిరీస్లు ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


Click it and Unblock the Notifications












