ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బిగ్ షాకిచ్చింది. వచ్చే ఏడాది మెగా వేలం జరగనున్న నేపథ్యంలో రిటెన్షన్ పాలసీపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. రైట్ టు మ్యాచ్(RTM)కింద మరో ఆటగాడిని తీసుకోవచ్చని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ లెక్కన ఫ్రాంచైజీలు తమ పాత ఆటగాళ్లలో నలుగురు ఆటగాళ్లను మాత్రమే అంటిపెట్టుకునే అవకాశం ఉంది. అయితే రిటెన్షన్ పాలసీపై ఇప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వాస్తవానికి రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యను ఎనిమిదికి పెంచాలని ఫ్రాంచైజీలు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ బీసీసీఐ మాత్రం రిటైన్ చేసుకునే ఆటగాళ్లను నలుగురికే పరిమితం చేసినట్లు తెలుస్తోంది.

గతంలో ఐదుగురి ఆటగాళ్ల వరకు రిటైన్ చేసుకునే అవకాశం ఉండేది. నలుగురిని రిటైన్ చేసుకుంటే.. మరొకరిని ఆర్టీఎమ్ కింద తీసుకునేవారు. ఒకవేళ ముగ్గురిని రిటైన్ చేసుకుంటే మరో ఇద్దరిని ఆర్టీఎమ్ ద్వారా కొనుగోలు చేసేవారు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఆర్టీమ్కు అవకాశం ఇవ్వలేదు.
కొత్తగా రెండు జట్లు రావడంతో రైట్ టు మ్యాచ్ కింద ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి అనుమతివ్వలేదు. ఈ రూల్ ప్రకారం తమ పాత ఆటగాడి వేలంలో పలికిన ధరను చెల్లించి తీసుకోవచ్చు. రిటెన్షన్ రూల్ ప్రకారం.. ఆర్టీఎమ్తో కలిసి గరిష్టంగా నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ముగ్గురు భారత క్రికెటర్లు, ఒక విదేశీ క్రికెటర్ లేదా ఇద్దరు భారత క్రికెటర్లు, ఇద్దరు విదేశీ క్రికెటర్లు ఉండొచ్చు.
నేరుగా రిటైన్ చేసుకునే ముగ్గురు ఆటగాళ్ల ధరలు కూడా బీసీసీఐ రూల్స్ ప్రకారమే ఉండాలి. మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంచైజీల పర్స్ వాల్యూ రూ. 110-120 కోట్లకు పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం టీమ్స్ పర్స్ వాల్యూ రూ. 100 కోట్లుగా ఉంది. ఈ డబ్బుతోనే జట్టుకు కావాల్సిన 22-24 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యను పెంచితే మెగా వేలానికి అర్థమే ఉండదని బీసీసీఐకి చెందిన ఓ అధికారి మీడియాతో అన్నారు. 'రిటెన్షన్ సంఖ్యను ఆర్టీఎమ్తో కలిపి 6 లేదా 8 పెంచాలని ఫ్రాంచైజీలు డిమాండ్ చేస్తున్నాయి. అలా చేస్తే మెగా వేలం నిర్వహించడం ఎందుకు? వేలం నిర్వహణ ఐపీఎల్కు అందం తీసుకోస్తుంది. కాబట్టి వేలానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. 'అని సదరు అధికారి చెప్పుకొచ్చాడు.