టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పందించింది. తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్న శుభ్మన్ గిల్ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న తొలి టెస్ట్కు అతను పూర్తిగా దూరమయ్యాడని పేర్కొంది. సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా కోల్కతా వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో శుభ్మన్ గిల్ మెడ నొప్పితో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ నొప్పి తీవ్రం కావడంతో శుభ్మన్ గిల్ను స్ట్రెచర్ సాయంతో అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి.
మెడకు సర్వైకల్ కాలర్తో స్ట్రెచర్పై తీసుకెళ్లడంతో పాటు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారనే వార్తలు ఆందోళనకు గురి చేశాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా గిల్ గాయంపై క్లారిటీ ఇచ్చింది. గిల్ గాయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ముందస్తు పరీక్షల్లో భాగంగానే ఆసుపత్రికి తరలించామని చెప్పింది.

'కోల్కతా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలో కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడకు గాయమైంది. ఆ రోజు ఆట ముగిసిన తర్వాత టెస్ట్ల కోసం అతన్ని ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం అతను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. గిల్ ఈ టెస్ట్ మ్యాచ్లో ఆడే అవకాశం లేదు. బీసీసీఐ మెడికల్ టీమ్ అతని ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది.'అని బీసీసీఐ పేర్కొంది. గిల్ గైర్హాజరీలో టీమిండియా 9 మంది బ్యాటర్లతోనే రెండో ఇన్నింగ్స్ ఆడనుంది.
వాస్తవానికి మ్యాచ్ తొలి రోజు ఆట రాత్రే శుభ్మన్ గిల్కు మెడ కండరాలు పట్టేసాయి. కానీ పెయిన్ కిల్లర్స్ సాయంతో అతను బ్యాటింగ్కు దిగాడు. మూడు బంతులు ఆడి ఓ బౌండరీ కూడా కొట్టాడు. ఈ బౌండరీ కొట్టే క్రమంలో అతని మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి తీవ్రమైంది. దాంతో గిల్ మైదానం వీడాడు. మళ్లీ బ్యాటింగ్కు రాలేదు. సాయంత్రానికి నొప్పి తీవ్ర కావడంతో కోల్కతాలోని వుడ్ ల్యాండ్స్ ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఆస్ట్రేలియా పర్యటనలో శ్రేయస్ అయ్యర్ కూడా ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. అతని ప్లీహంలో చీలిక రావడంతో రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. తాజాగా గిల్ కూడా ఐసీయూలో చేరడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. రెండో టెస్ట్కు కూడా శుభ్మన్ గిల్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు నిద్రలేమి కారణంగానే శుభ్మన్ గిల్ మెడ కండరాలు పట్టేసాయని, త్వరలోనే కోలుకుంటాడని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ తెలిపాడు.