భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే ఐదు టెస్ట్ల సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లండ్లో పర్యటించనుంది. ఈ సిరీస్తోనే డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్ ప్రారంభం కానుంది.
అయితే ఈ పర్యటనకు ముందే రోహిత శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కెప్టెన్సీతో పాటు ఆటగాడిగా అవకాశం లేదని సెలెక్టర్లు చెప్పడంతోనే రోహిత్ శర్మ తప్పుకున్నాడని ప్రచారం జరిగింది. కానీ ప్రపంచ క్రికెట్లోనే అత్యంత ఫిట్టెస్ట్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ తనకు నచ్చిన ఫార్మాట్కు వీడ్కోలు పలకడం అందర్నీ అయోమయానికి గురి చేసింది.

విరాట్ కోహ్లీ లేని లోటు టీమిండియాలో కనబడనుంది. అయితే ఈ ఇద్దరి దిగ్గజాలను ఇంగ్లండ్ పర్యటనలోని తొలి టెస్ట్కు బీసీసీఐ ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. జూన్ 20న లీడ్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు హాజరయ్యే అవకాశం ఉంది. మ్యాచ్కు ముందు ఈ ఇద్దరికి గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారత క్రికెట్కు చేసిన సేవలకు గుర్తింపుగా వారికి గౌరవ వందన కార్యక్రమం ఏర్పాటు చేయాలనే యోచనలో బీసీసీఐ ఉంది.
కోహ్లీ, రోహిత్ శర్మలను ఇంగ్లండ్ పర్యటనలోని తొలి టెస్ట్కు హాజరవ్వాలని ప్రత్యేకంగా కోరనుందని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు ఫేర్వెల్ మ్యాచ్ ఏర్పాటు చేసి ఘనంగా వీడ్కోలు పలకాలని అనిల్ కుంబ్లే వంటి మాజీ ఆటగాళ్లు బీసీసీఐకి సూచిస్తున్నారు. ఫ్యాన్స్ సైతం దిగ్గజ ఆటగాళ్లు అయిన కోహ్లీ, రోహిత్ నిశబ్దంగా నిష్క్రమించడం బాలేదని కామెంట్ చేస్తున్నారు.