
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా వైఫల్యంతో బీసీసీఐ.. జట్టుతో పాటు సెలెక్షన్ కమిటీలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీపై వేటు వేసింది. ఇందులో ఇప్పటివరకు హర్విందర్ సింగ్, సునీల్ జోషి, దేబశిష్ మొహంతి సభ్యులుగా ఉన్నారు. వీరి పదవి కాలం ఇంకా ఉన్నా.. రద్దు చేసిన బీసీసీఐ కొత్త సెలెక్షన్ కమిటీ నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 28వ తేదీ వరకు గడువు విధించింది. ఇక కొత్తగా వచ్చే సెలెక్షన్ ప్యానల్ నిర్వహించాల్సిన బాధ్యతలపై బీసీసీఐ ఎనిమిది పాయింట్లతో కూడిన జాబితాను విడుదల చేసింది.
సెలెక్షన్ కమిటీ విధులు - బాధ్యతలు
1. న్యాయంగా, పారదర్శక పద్ధతిలో అత్యుత్తమ జట్టును ఎంపిక చేయాలి.
2. సీనియర్ పురుషుల టీమ్ రిజ్వర్ బెంచ్ను బలోపేతం చేయడంపై దృష్టిపెట్టాలి. దానికి తగ్గట్లు ప్రణాళికలు తయారు చేయాలి.
3. అవసరమైన సందర్భంలో జట్టు సమావేశాలకు హాజరు కావాలి.
4. దేశీయ, అంతర్జాతీయ మ్యాచ్లను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రయాణాలు చేస్తూ ఉండాలి.
5. ఆటగాళ్ల, జట్టు ప్రదర్శనపై ప్రతి మూడు నెలలకోసారి నివేదికలు రూపొందించి బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్కు సమర్పించాలి.
6. జట్టు ఎంపికపై, బీసీసీఐ ఆదేశాల మేరకు మీడియాతో మాట్లాడాలి. అవసరమైతే కొత్తగా తీసుకున్న ఆటగాళ్లు, పక్కన పెట్టిన ప్లేయర్ల గురించి వివరణ ఇవ్వాలి.
7. ప్రతి ఫార్మాట్కు సరైన నాయకుడిని నియమించాలి. (వేర్వేరు కెప్టెన్ల పద్దతి)
8. బీసీసీఐ నియమ నిబంధనలకు కట్టుబడి పని చేయాలి..
సభ్యులకు ఉండాల్సిన అర్హతలు:
1. కనీసం 7 టెస్టు మ్యాచ్లు లేదా 30 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి ఉండాలి.
2. క్రికెట్కు వీడ్కోలు పలికి దాదాపు ఐదేళ్లు పూర్తి కావాలి.
3. ఐదుగురు సభ్యులకు వయసు పరిమితి 60 ఏళ్లులోపే ఉండాలి.
4. మొత్తం 5 సంవత్సరాల పాటు ఏదైనా క్రికెట్ కమిటీలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి దరఖాస్తు చేసుకొనేందుకు అనర్హుడు.