బీసీసీఐ మెన్స్ సీనియర్ సెలెక్షన్ కమిటీలోని ఓ సభ్యుడిపై వేటు పడినట్లు తెలుస్తోంది. అతని స్థానంలో కొత్త సభ్యుడిని తీసుకునేందుకు బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ వ్యవహారంపై బీసీసీఐ అయితే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా వైఫల్యం అనంతరం బీసీసీఐ.. చేతన్ శర్మ సారథ్యంలోని అప్పటి సెలెక్షన్ కమిటీని రద్దు చేసింది. ఆ కమిటీకి గడువు ఉన్నా.. భారత వైఫల్యాన్ని కారణంగా చూపుతూ నూతన కమిటీని ఎంపిక చేసింది. ఈ కొత్త కమిటీకి మళ్లీ చేతన్ శర్మనే చైర్మన్గా నియమించింది. ఈ బోర్డులో సలీల్ అంకోలా, సబ్రతో బెనర్జీ, శివ్ సుందర్ దాస్, ఎస్ శరత్లు సభ్యులుగా ఉన్నారు.

చేతన్ శర్మపై వేటు..
అయితే ఓ ఛానెల్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్లో చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ బీసీసీఐ నిబంధనలకు విరుద్దంగా భారత క్రికెట్ రహస్యాలను వెల్లడించాడు. విరాట్ కోహ్లీ- సౌరవ్ గంగూలీ గొడవతో పాటు సీనియర్ ప్లేయర్ల ఫిట్నెస్ వ్యవహారంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దాంతో అతన్ని బీసీసీఐ సైలెంట్గా తప్పించింది. ఎలాంటి ప్రకటనా.. వివరణ ఇవ్వకుండా తొలగించింది.
చాలా కాలం పాటు చీఫ్ సెలెక్టర్ లేకుండానే.. కమిటీ సభ్యులు భారత జట్టును ఎంపిక చేశారు. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో చీఫ్ సెలెక్టర్గా మాజీ పేసర్ అజిత్ అగర్కార్ను బీసీసీఐ నియమించింది. ప్రస్తుతం అగర్కార్ సారథ్యంలోనే భారత సెలెక్షన్ కమిటీ పని చేస్తోంది. అయితే కమీటీలో భాగమైన సలీల్ అంకోలా, అజిత్ అగర్కార్ ఇద్దరూ వెస్ట్ జోన్కు చెందినవారు.
అగార్కర్ కోసం..
ఇది బీసీసీఐ నిబంధనలకు విరుద్దం. బోర్డు రాజ్యాంగం ప్రకారం ప్రతీ జోన్ నుంచి సెలెక్షన్ కమిటీలో ఒక్కో సభ్యుడు ఉండాలి. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, సెంట్రల్ జోన్ల నుంచి ఒక్కో సభ్యుడిని సెలెక్షన్ కమిటీలోకి ఎంపికవుతాడు. వీరిలో నుంచి చీఫ్ సెలెక్టర్ను నియమిస్తారు. అయితే అగార్కర్, సలీల్ అంకోలా ఇద్దరూ ఒకే జోన్కు చెందినవారు కావడంతో మార్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చీఫ్ సెలెక్టర్ అగార్కర్ కోసం సలీల్ అంకోలా తన పదవిని త్యాగం చేయాల్సి వస్తోంది. ప్రస్తుత కమిటీలో శివ సుందర్ ఈస్ట్, శతర్ సౌత్, సుబ్రత్ బెనర్జీ సెంట్రల్ జోన్ నుంచి సెలెక్టర్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నార్త్ జోన్ నుంచి కొత్త సెలెక్టర్ను ఎంపిక చేయాల్సి ఉంది.
సెలెక్టర్ అవ్వాలంటే..
సెలెక్టర్గా ఎంపికవ్వాలంటే 7 టెస్ట్లు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు.. 10 అంతర్జాతీయ వన్డేలు లేదా 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి ఉండాలి. అంతేకాకుండా ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి ఐదేళ్లు పూర్తి కావాలి. అలాగే ఈ ఐదేళ్ల కాలంలో ఏ క్రికెట్ కమిటీలోనూ సభ్యుడిగా ఉండకూడదు. బీసీసీఐ నోటిఫికేషన్ ప్రకారం సెలెక్టర్ పదవికి ఈ నెల 25న సాయంత్ర 6 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.