టీమిండియా హెడ్ కోచ్ పదవికి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి కలిగినవారు మే 27, సాయంత్ర 6 గంటల లోపు ద దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. బీసీసీఐ సెక్రటరీ జై షా పేరిట ఉన్న ఈ ప్రకటనలో టీమిండియా పురుషుల టీమ్ హెడ్ కోచ్కు కావాల్సిన అర్హతలు, చేయాల్సిన పనుల గురించి ప్రస్తావించింది.
కొత్తగా ఎంపికయ్యే హెడ్ కోచ్.. పదవి కాలం మూడున్నరేళ్లు ఉంటుందని, 2027 డిసెంబర్ 31 వరకు కొనసాగుతారని పేర్కొంది. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవి కాలం అప్కమింగ్ టీ20 ప్రపంచకప్ 2024తో ముగియనుంది. కొత్తగా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేవాళ్ల వయసు 60 ఏళ్ల కంటే తక్కువగా ఉండాలని, పారితోషికం అనుభవాన్ని బట్టి ఉంటుందని బీసీసీఐ పేర్కొంది.

కొత్తగా బాధ్యతలు చేపట్టేవారు మూడు ఫార్మాట్లలో టీమిండియా ప్రధాన కోచ్గా పనిచేయాల్సి ఉంటుంది. అతనికి 14-16 మంది సహాయక సిబ్బంది ఉంటారు. జట్టు ప్రదర్శన, నిర్వహణకు హెడ్ కోచ్ పూర్తి బాధ్యత వహించాలి. సహాయక బృందానికి కూడా హెడ్ కోచ్ సారథ్యం వహిస్తాడు. భారత జట్టులోని క్రమశిక్షణ కోడ్లను సమీక్షించడం, నిర్వహించడం, అమలు చేయడం హెడ్ కోచ్ ప్రధాన బాధ్యత.
హెడ్ కోచ్ పదవికి ఉండాల్సిన అర్హతలు..
అంతర్జాతీయ క్రికెట్లో కనీసం 30 టెస్ట్ మ్యాచ్లు, లేదా 50 వన్డేలు ఆడి ఉండాలి. అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేకుంటే ఐసీసీ గుర్తింపు పొందిన ఏదైనా దేశానికి రెండేళ్లుగా కోచ్గా పనిచేయాల్సి ఉంటుంది. లేదంటే ఏదైనా ఐపీఎల్ టీమ్, ఫ్రాంచైజీ లీగ్స్లోని జట్లకు హెడ్ కోచ్గా కనీసం మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. కోచ్గా బీసీసీఐ లెవల్ 3 సర్టిఫికేషన్ కలిగి ఉండాలి.
రేసులో తెలుగోడు..
ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ద్రవిడ్తో పాటు తెలుగు తేజం, హైదరాబాద్ సొగసరి బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం అతను ఎన్సీఏ డైరెక్టర్గా కొనసాగడంతో పాటు అండర్ 19, భారత్ ఏ జట్లకు హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు.
విదేశీ కోచ్లు కూడా టీమిండియా హెడ్ కోచ్ పదవికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్తో పాటు టామ్ మూడీ వంటి దిగ్గజాలు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే డంకన్ ఫ్లెచర్ తర్వాత బీసీసీఐ విదేశీ కోచ్లకు అవకాశం ఇవ్వలేదు.