న్యూఢిల్లీ: కరోనా కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్లో మిగిలిన మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అధ్యక్షతన శనివారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)లో సెకండాఫ్ లీగ్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఏ తేదీల్లో నిర్వహిస్తామనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కానీ సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 12 మధ్య లీగ్ జరగవచ్చని బోర్డు వర్గాలు తెలిపాయి
అయితే ఐపీఎల్ సెకండాఫ్ నిర్వహణ కోసం కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) షెడ్యూల్ను మార్చేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఈ విషయమై విండీస్ క్రికెట్ బోర్డుతో చర్చలు మొదలుపెట్టింది. షెడ్యూల్ ప్రకారం సీపీఎల్ 9వ సీజన్ను ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 19 వరకు జరగనుంది. అయితే, ఆ లీగ్ ఫైనల్ మ్యాచ్.. ఐపీఎల్ రిస్టార్ట్ షెడ్యూల్తో క్లాష్ అవుతుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈ చర్యలకు ఉపక్రమించింది. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 10లోపు మిగిలిన మ్యాచ్లు పూర్తి చేయాలని తాజాగా జరిగిన స్పెషల్ జనరల్ మీటింగ్లో బీసీసీఐ తీర్మానించింది. ఈ నేపథ్యంలోనే సీపీఎల్ను కాస్త ముందుగా సెప్టెంబర్ 14, 15లోగా ముగిసేలా షెడ్యూల్ను మార్చాలని ఆ బోర్డుతో సంప్రదింపులు చేస్తోంది.
ముఖ్యంగా ఆటగాళ్లను బబుల్ నుంచి మరో బబుల్లోకి తరలించడం తేలికవుతుందని, అలాగే విండీస్ ఆటగాళ్లు యూఏఈకి చేరుకున్నాక మూడు రోజుల క్వారంటైన్ గడువు కూడా కలిసొస్తుందని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే విండీస్ బోర్డును ఒప్పించే పనిలో పడిందని ఓ అధికారి చెప్పారు. ఒకవేళ ఈ చర్చలు విఫలమై.. విండీస్ బోర్డు తమ తేదీల్లో మార్పులు చేసుకోకపోతే.. విండీస్ కీలక ఆటగాళ్లు ఐపీఎల్ ప్రారంభమయ్యాక కొన్ని మ్యాచ్లు ఆడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ జాబితాలో కీరన్ పొలార్డ్, క్రిస్గేల్, డ్వేన్ బ్రావో, షిమ్రన్ హెట్మైర్, జేసన్ హోల్డర్, నికోలస్ పూరన్, ఫాబియన్ అలెన్, కీమో పాల్, సునీల్ నరైన్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు.
ఇక 2021 ఐపీఎల్లో 29 మ్యాచ్లు నిర్వహించిన అనంతరం అనూహ్యంగా ఆటగాళ్లకు కరోనా సోకడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లీగ్ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్లే ఆఫ్స్ సహా లీగ్లో మరో 31 మ్యాచ్లు జరగాల్సి ఉంది.