భారత మహిళా క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. దేశవాళీ క్రికెట్ ఆడే మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను రెట్టింపు చేసింది. మహిళల వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో క్రికెట్ను కెరీర్గా ఎంచుకునే అమ్మాయిలకు ఆర్థిక స్థిరత్వం పెరగనుంది. ఈ మ్యాచ్ ఫీజుల పెంపుదలను బోర్డు అపెక్స్ కౌన్సిల్ ధ్రువీకరించింది.
బీసీసీఐ తాజా నిర్ణయం ప్రకారం.. సీనియర్ మహిళల దేశవాళీ వన్డే టోర్నీ, మల్టీ టీమ్ టోర్నీల్లో తుది జట్టులో ఉన్న ఆటగాళ్లకు రోజు రూ.50 వేలు మ్యాచ్ ఫీజుగా చెల్లించనున్నారు. గతంలో ఈ ఫీజు రూ.20 వేలుగా ఉండేది. రిజర్వ్ ప్లేయర్లకు రూ.25 వేలు దక్కనుంది.
దేశవాళీ టీ20 టోర్నీల్లో తుది జట్టులో ఉన్న ప్లేయర్లకు రోజుకు రూ.25 వేలు, రిజర్వ్ ప్లేయర్లకు రూ.12500 మ్యాచ్ ఫీజు దక్కనుంది. అన్ని ఫార్మాట్లలో ఆడే అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు సీజన్లో రూ.12 నుంచి రూ.14 లక్షల ఆదాయం లభించనుంది. ఇక అండర్ 23, అండర్ 19లో ఆడే అమ్మాయిలకు రోజుకు రూ.25 వేలు చెల్లిస్తారు. రిజర్వ్లు రూ.12,500 పొందుతారు.

మరోవైపు దేశవాళీ అంపైర్లు, రిఫరీల ఆదాయాన్ని కూడా బీసీసీఐ పెంచింది. అంపైర్లకు రోజుకు రూ.40 వేలు అందుకోనున్నారు. నాకౌట్ మ్యాచ్లకైతే మ్యాచ్ ప్రాధాన్యతను బట్టి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఉంటుంది. అంటే ఓ అంపైర్ రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్కు రూ.1.60 లక్షలు, నాకౌట్కు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలు అందుకోనున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ ఆడే మహిళలకు పురుషు తరహాలోనే బీసీసీఐ సమాన వేతానాన్ని అందిస్తోంది. ఒక్కో టెస్ట్ మ్యాచ్కు రూ.15 లక్షలు, వన్డే మ్యాచ్కు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్కు రూ.3 లక్షల మ్యాచ్ ఫీజులు అందజేస్తుంది. 2022 అక్టోబర్ నుంచి పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు అందజేస్తోంది.
మ్యాచ్ ఫీజులు సమానంగా ఉన్నప్పటికీ, వార్షిక కాంట్రాక్టుల్లో మాత్రం పురుషులకు, మహిళలకు చాలా వ్యత్యాసం ఉంది. మహిళా ప్లేయర్లను మూడు కేటగిరీలుగా విభజించి వార్షిక వేతనం అందజేస్తున్నారు. గ్రేడ్ ఏ ప్లేయర్లకు రూ.50 లక్షల వార్షిక వేతనం అందుతుండగా.. గ్రేడ్ బీ రూ.30 లక్షలు, గ్రేడ్ సీ రూ.10 లక్షలు అందుకుంటున్నారు. పురుషుల క్రికెట్ కాంట్రాక్టులు నాలుగు కేటగిరీలుగా ఉన్నాయి. ఏ+ గ్రేడ్ ఆటగాళ్లకు రూ.7 కోట్ల వార్షిక వేతనం అందనుండగా. గ్రేడ్ ఏ ప్లేయర్లకు రూ.5 కోట్లు, గ్రేడ్ బి రూ.3 కోట్లు, గ్రేడ్ సీ ఆటగాళ్లు కోటి రూపాయల వార్షిక వేతనం అందుకుంటున్నారు.