టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తోంది. చీలమండ గాయంతో ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న షమీ.. ఇటీవలే రంజీ ట్రోఫీతో పునరాగమనం చేశాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడుతున్నాడు.
ఈ రెండు టోర్నీల్లో షమీ మెరుగైన ప్రదర్శన చేయడంతో టీమిండియాలోకి పునరాగమనం చేస్తాడని అంతా అనుకున్నారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్ట్ లేదా మూడో టెస్ట్కు షమీ అందుబాటులోకి వస్తాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ షమీకి బీసీసీఐ రెండు కండీషన్స్ పెట్టిందని, డెడ్లైన్లోగా వాటిని అందుకుంటేనే అతను ఆసీస్ పర్యటకు వెళ్తాడని మరో ప్రచారం తెరపైకి వచ్చింది.

ప్రస్తుతం షమీ అధిక బరువు ఉన్నాడని, అతను ఆసీస్ పర్యటనకు వెళ్లాలంటే బరువు తగ్గాలని, పూర్తి ఫిట్నెస్ సాధించాలని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. 'బీసీసీఐ వైద్యబృందం నిరంతరం మహమ్మద్ షమీని పర్యవేక్షిస్తోంది. అతను ఎలా బౌలింగ్ చేస్తున్నాడనే విషయాన్ని గమనిస్తోంది. మెడికల్ టీమ్ నుంచి నో అబ్జేక్షన్ సర్టిఫికేట్(ఎన్ఓసీ) వస్తేనే షమీ రీఎంట్రీపై బీసీసీఐ ఓ నిర్ణయానికి రానుంది.
రంజీ ట్రోఫీతో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్ల్లో షమీ బౌలింగ్పై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. కానీ టీ20ల్లో నాలుగు ఓవర్ల స్పెల్ కాబట్టి అతని ఫిట్నెస్పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అతడు టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలంటే రెండు విషయాల్లో పాస్ అవ్వాల్సిందే.
డిసెంబర్ రెండో వారం లోపే ఆ టెస్ట్లను క్లియర్ చేయాలి. ప్రస్తుతం షమీ అధిక బరువుతో ఉన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాలంటే అతను బరువు తగ్గాలి. పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించాలి. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉంది. ఆ టోర్నీని దృష్టిలో ఉంచుకొని సీనియర్ బౌలర్పై ఆందోళన లేకుండా చూడాలి.'అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.