
న్యూఢిల్లీ: యూఏఈ వేదికగా అక్టోబర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటాడనే వార్తల్లో నిజం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పష్టం చేసింది. ఈ మేరకు బోర్డు ట్రెజరర్ అరుణ్ ధూమల్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ఈ వార్తలను కొట్టిపారేశాడు. భారత జట్టు మూడు ఫార్మాట్ల కెప్టెన్ విరాట్ కోహ్లీనేనని, టీ20 ప్రపంచకప్ తర్వాత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ రోహిత్ శర్మకు ఇస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. అసలు ఇద్దరు కెప్టెన్ల విధానం గురించి తాము చర్చించనేలేదన్నాడు.
'ఇవన్నీ గాలి వార్తలే. కెప్టెన్సీ మార్పు విషయంపై మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇద్దరు కెప్టెన్ల విధానంపై బీసీసీఐ ఇప్పటి వరకు చర్చలు కూడా చేయలేదు. మూడు ఫార్మాట్లలో భారత జట్టు కెప్టెన్గా విరాట్ కోహ్లీనే కొనసాగుతాడు.'అని అరుణ్ ధూమల్ పేర్కొన్నాడు.
ఇక మెగా టోర్నీ ముగిసిన తర్వాత కోహ్లీ పరిమిత ఓవర్ల కెప్టెన్సీని వదులుకోనున్నాడని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే ఈ విషయమై కోహ్లీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి సమాచారామిచ్చాడని పేర్కొంది. అంతేకాకుండా పరిమిత ఓవర్ల సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మకు ఇవ్వాలని స్వయంగా కోహ్లీనే.. బీసీసీఐ సూచించాడని రాసుకొచ్చింది.
2014లో మహేంద్రసింగ్ ధోనీ నుంచి టెస్టు కెప్టెన్సీని అందుకున్న విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత 2017లో టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. కానీ.. అతని కెప్టెన్సీలో ఇప్పటి వరకూ కనీసం ఒక్క ఐసీసీ టైటిల్ని కూడా భారత్ జట్టు గెలవలేదు. దాంతో.. గత రెండేళ్ల నుంచి కెప్టెన్సీ విభజనపై చర్చ జరుగుతూ ఉంది. మరోవైపు బ్యాట్స్మన్గా కూడా కోహ్లీ గత రెండు ఏళ్లుగా విఫలమవుతున్నాడు. మైదానంలోకి దిగితే సెంచరీల మోత మోగించే విరాట్.. గత రెండుళ్లుగా ఒక్క సెంచరీ బాదలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే బ్యాటింగ్పై ఎక్కువ ఫోకస్ చేసేందుకు, మునపటి ఫామ్ అందుకునేందుకు వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోహ్లీ నిర్ణయించుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ కథనంలో పేర్కొంది.
మరోవైపు బీసీసీఐ సైతం ఇద్దరి కెప్టెన్ల విధానాన్ని అమలు చేయాలని భావిస్తోందని, దీనిపై జూలైలో జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్యసమావేశంలోనే చర్చ జరిగిందని, టీ20 ప్రపంచకప్ తర్వాత అమలు చేయాలని భావింస్తుందని ఓ బోర్డు అధికారి చెప్పినట్లు గత రెండు రోజులు వార్తలు షికారు చేస్తున్నాయి. మరోవైపు ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీ బాధ్యతారహిత్యం బోర్డు పెద్దలకు ఆగ్రహం తెప్పించిందని కూడా వార్తలు వచ్చాయి.
హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి పబ్లిక్ ఈవెంట్కి వెళ్లిన విరాట్ కోహ్లీ.. బయో- సెక్యూర్ బబుల్ రూల్ని బ్రేక్ చేశాడు. దాంతో.. రవిశాస్త్రితో పాటు కోహ్లీని తొలుత వివరణ కోరిన బీసీసీఐ.. భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు రద్దుకి ఆ పబ్లిక్ ఈవెంట్ కారణంగా తేలడంతో.. కఠిన చర్యలకి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ను మార్చడం, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగడం వంటి కోహ్లీ ఏకపక్ష నిర్ణయాలపై బోర్డు ఆగ్రహంగా ఉందని, ఈ క్రమంలో విరాట్ తన కెప్టెన్సీని వదులుకునేందుకు సిద్దమయ్యాడనే వాదన వినిపిస్తోంది. కానీ బీసీసీఐ ఇవ్వన్నీ గాలి కథనాలేనని స్పష్టం చేసింది.