మళ్లీ భువనేశ్వర్ ఎందుకయ్యా!
సీనియర్ పేసర్లు అయిన జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలకు విశ్రాంతి కల్పించిన సెలెక్షన్ కమిటీ శార్దూల్ ఠాకూర్ను కూడా ఈ సిరీస్కు పక్కన పెట్టింది. కానీ టీ20 ప్రపంచకప్లో దారుణంగా విఫలమైన భువనేశ్వర్ కుమార్కు మళ్లీ అవకాశం కల్పించింది. అతనితో పాటు దీపక్ చాహర్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్తో పాటు మహమ్మద్ సిరాజ్లను ఎంపిక చేసింది. అయితే ఫామ్ కోల్పోయిన భువనేశ్వర్ను మళ్లీ ఎందుకు ఎంపిక చేశారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అతన్ని దేశవాళీ క్రికెట్కు పంపించి అక్కడ ఫామ్ అందుకునేలా చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అయితే భువీకి ఇది చివరి టీ20 సిరీసని, అతని కెరీర్ ముగిసినట్లేనని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.
పృథ్వీషాను ఎందుకు పక్కనపెట్టారు..?
ఐపీఎల్లో సత్తా చాటిన పృథ్వీషాను ఎందుకు పక్కనపెట్టారని, వరుణ్ చక్రవర్తీ, హార్దిక్ పాండ్యాపై వేటు వేసి భువనేశ్వర్కు ఎందుకు అవకాశం కల్పించారని అభిమానులు నిలదీస్తున్నారు. 31 ఏళ్ల భువీని జట్టులోకి తీసుకొని ఏం సాధిద్దామనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. అతనికి బదులు ఓ యువ ఆటగాడిని తీసుకున్నా టీమ్ పనికొస్తాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం భువనేశ్వర్ను తీసుకొని మంచి పనిచేశారని, అతనికి మరో అవకాశం ఇవ్వడం సబబేనంటున్నారు.
ఐదుగురు ఓపెనర్లు అవసరమా?
ఇక జట్టులో ఐదుగురు ఓపెనర్లు ఉన్నారని వారిని ఎలా ఉపయోగిస్తారని నిలదీస్తున్నారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యార్, ఇషాన్ కిషన్ అందరూ ఓపెనర్లేనని వీరితో టీమ్ కూర్పు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. తీరిక లేకుండా క్రికెట్ ఆడుతున్న రిషభ్ పంత్కు కూడా విశ్రాంతివ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన రాహుల్ చాహర్ను పక్కనపెట్టడం ఏమాత్రం భావ్యం కాదంటున్నారు. చాహల్ను కాదని టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేసినా.. అతనికి తుది జట్టులో అవకాశం ఇవ్వలేదని, నమీబియాతో ఆడించి పక్కన పెట్టడం సబబు కాదంటున్నారు.
రోహిత్ కెప్టెన్ సూపరో సూపర్..
ఇక టీ20 ఫార్మాట్ సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మకు ఇవ్వడాన్ని అభిమానులు స్వాగతిస్తున్నారు. టీమిండియా రాత పూర్తిగా మారిపోతుందని, రాహుల్ ద్రవిడ్-హిట్ మ్యాన్ కాంబినేషన్లో టైటిల్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. టీమ్ ఎంపికలో రోహిత్ మార్క్ కనిపించిందని, యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడంలో హిట్ మ్యాన్ పాత్ర కీలకమని కామెంట్ చేస్తున్నారు. ఆటగాళ్లను తీసుకోవడం, తీసేయడం వెనుక గల కారణాలను బీసీసీఐ వెల్లడించాలని ఓ అభిమాని కామెంట్ చేశాడు. భారత జర్నలిస్ట్లు ఆ దిశగా బీసీసీఐని నిలదీయాలన్నాడు.


Click it and Unblock the Notifications
