
న్యూఢిల్లీ: ఆటకు దూరమై చాలా రోజులైనా తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నిరూపించాడు. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) నేపథ్యంలో అహ్మదాబాద్లో లక్షాపదివేల సీటింగ్ కెపాసిటీతో నూతనంగా నిర్మించిన మోతెరా స్టేడియంలో బుధవారం జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్లో దాదా హాఫ్ సెంచరీతో మెరిసాడు. బోర్డు సెక్రటరీ జైషా నేతృత్వంలోని సెక్రటరీ ఎలెవన్తో జరిగిన మ్యాచ్లో 32 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న గంగూలీ.. తన టీమ్ను ప్రెసిడెంట్ ఎలెవన్ను మాత్రం గెలిపించుకోలేకపోయాడు. ప్రెసిడెంట్ ఎలెవెన్పై 28 పరుగుల తేడాతో సెక్రటరీ ఎలెవన్ విజయం సాధించింది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్, మాజీ బ్యాట్స్మెన్ బ్రిజేష్ పటేల్, సౌరాష్ట్ర మాజీ కెప్టెన్ జయదేవ్ షా ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ బరిలోకి దిగారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జైషా ఎలెవన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 123 పరుగులు చేసింది. ఆ జట్టులో జయదేవ్ షా(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 38), మహ్మద్ అజారుద్దీన్(22 బంతుల్లో7 ఫోర్లతో 37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన గంగూలీ 26 పరుగులిచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు.

అనంతరం 124 పరుగుల లక్ష్యచేధనకు దిగిన గంగూలీ ఎలెవన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 100 పరుగులే చేసి 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గంగూలీ (32 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్తో 53) రాణించినా ఫలితం లేకపోయింది. షిర్జీత్ నాయర్(10 బంతుల్లో 10)మినహా ఇతర బ్యాట్స్మెన్ రెండెంకల స్కోర్ చేయలేకపోయారు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన జై షా 39 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు.
గురువారం (డిసెంబర్ 24న) అహ్మదాబాద్లోనే బీసీసీఐ ఏజీఎం జరగనుంది. ఈ సమావేశంలో ఐపీఎల్ 2021 సీజన్ నిర్వహణ, టీ20 ప్రపంచకప్ నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే దేశావాళీ రంజీ ట్రోఫీ నిర్వహణపై కూడా చర్చించనున్నారు. అంతేకాకుండా బ్రాడ్కాస్టర్ హక్కులు, స్ఫాన్సర్షిప్కి సంబంధించిన ఒప్పందాలను సవరించాల్సిన విషయాలు కూడా చర్చకు రానున్నాయి. అంతేకాకుండా ఐపీఎల్ 2021 వేలం, జట్ల సంఖ్యపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.