
న్యూఢిల్లీ: వన్డే కెప్టెన్సీ మార్పుతో భారత క్రికెట్లో రేగిన చిచ్చు ఇప్పట్లో ఆరేలా లేదు. నిన్నటి వరకు రోహిత్ X విరాట్గా ఉన్న పరిస్థితి.. ఇప్పుడు కోహ్లీ X బీసీసీఐగా మారింది. టీ20 కెప్టెన్సీ వదులు కోవద్దని తాను కోహ్లీని పర్సనల్గా రిక్వెస్ట్ చేశానని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ చెప్పగా.. అలాంటిదేమి జరగలేదని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. టీ20 కెప్టెన్సీపై పునరాలోచన చేయాలని తనను ఎవరూ కోరలేదని సౌతాఫ్రికా పర్యటనకు ముందు బుధవారం జరిగిన ప్రెస్మీట్లో విరాట్ కోహ్లీ కుండబద్దలు కొట్టాడు. అంతేకాకుండా వన్డే కెప్టెన్సీ మార్పుపై కూడా తనకు ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నాడు. కోహ్లీ వ్యాఖ్యలతో గంగూలీతో సహా బీసీసీఐ పెద్దలంతా ఇరకాటంలో పడ్డారు.
ఇక కోహ్లీ వ్యాఖ్యలపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. బోర్డుకు చెందని ఓ అధికారి టైమ్స్ నౌతో మాట్లాడుతూ విరాట్ కోహ్లీపై మండిపడ్డారు. 'విరాట్ కోహ్లీతో బోర్డుకు సరైన కమ్యూనికేషన్ లేదు. అతను జట్టు సభ్యులకు కూడా సరిగ్గా అందుబాటులో ఉండటం లేదు. సెలెక్షన్ కమిటీకి ఏ మాత్రం సహకరించడం లేదు. వారితో ఇంటరాక్ట్ కూడా అవడం లేదు. కెప్టెన్సీ మార్పు విషయాన్ని 10 రోజుల ముందే చెప్పాలని బీసీసీఐ రాజ్యంగంలో రాసి ఉందా? కెప్టెన్సీ నుంచి తప్పించడం, కొత్త కెప్టెన్ను ఎంపిక చేయడమనేది సెలెక్టర్ల పని. ఓ ఆటగాడిగా జట్టులో ఉంటూ నీ నుంచి మెరుగైన ప్రదర్శనను ఇవ్వాలి.
గత 4 నెలలుగా బీసీసీఐ వేర్వేరు కెప్టెన్ల అంశంపై చర్చిస్తుంది. టీ20 ప్రపంచకప్ వైఫల్యం అనంతరం పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్ను మార్చాలనుకుంది. టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీనే తప్పుకున్నాడు. అది అతను సుమోటోగా తీసుకున్న నిర్ణయం. టీ20 ప్రపంచకప్ జరిగిన పరిణామాలకు దానికి ఎలాంటి సంబంధం లేదు. వైట్ బాల్ ఫార్మాట్లో ఒకే కెప్టెన్ ఉండాలనే విషయంపై మేమంతా స్పష్టంగా ఉన్నాం.
ప్రస్తుత పరిస్థితి ఎలా హ్యాండిల్ చేయాలని, బీసీసీఐ vs విరాట్ కోహ్లీ అనే వాదన తెరపైకి రాకుండా ఉండేందుకు చేయాల్సిన పనులపై బోర్డు పెద్దలు సమాలోచనలు చేస్తున్నారు. ఈ పూర్తి వ్యవహారంపై ప్రెస్ మీట్ పెట్టాలా? లేక ఓ ప్రకటనను విడుదల చేయాలా? అనేదానిపై చర్చిస్తున్నారు. బీసీసీఐ టాప్ అఫిషియల్స్ విరాట్ కోహ్లీపై ఆగ్రహంగా ఉన్నారు. విరాట్ కోహ్లీకి షోకాజ్ నోటీసులు పంపించి తన వ్యాఖ్యల పట్ల వివరణ కూడా కోరనున్నారు.'అని సదరు అధికారి తెలిపారు.