మ్యాచ్ మధ్యలో ప్రియురాలికి మెసేజ్.. బీసీసీఐ కఠిన చర్యలు!
మ్యాచ్ జరుగుతుండగా ప్రియురాలికి మెసేజ్ చేసిన తమిళనాడు ఆటగాడిపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. లక్ష రూపాయాల భారీ జరిమానా విధించింది. సదరు ఆటగాడిపై తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ రెండేళ్లు నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్పీఎల్)లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా ఓ ఆటగాడు డగౌట్లో మొబైల్ ఉపయోగించినట్లు, తన ప్రియురాలికి టెక్స్ట్ మెసేజ్లు పంపించినట్లు బీసీసీఐ యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ గుర్తించింది. బీసీసీఐ రూల్స్ ప్రకారం మ్యాచ్ జరుగుతుండగా ఆటగాళ్లు, కోచ్లు మొబైల్ ఉపయోగించడం నిషిద్దం. ప్రస్తుతం విచారణ జరుగుతుండటంతో సదరు ఆటగాడి పేరును బయటకు వెల్లడించలేదని తమిళన క్రికెట్ అసోసియేషన్కు చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు.

'విచారణ జరుగుతున్నందున టీఎన్సీఏ సదరు ఆటగాడి పేరును వెల్లడించలేదు. లెఫ్టార్మ్ బ్యాటర్ అయిన సదరు ఆటగాడు గతేడాది రంజీ ట్రోఫీలో తమిళనాడు జట్టు తరఫున రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. టీఎన్పీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అతను తన ప్రియురాలికి టెక్ట్స్ మెసేజ్లు పంపిస్తూ పట్టుబడ్డాడు. అతనిపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనప్పటికీ.. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్లేయర్స్, మ్యాచ్ అఫిషియల్స్ ఏరియాలో మొబైల్ వాడటం నిషేదం.'అని సదరు అధికారి శుక్రవారం పీటీఐకి వెల్లడించాడు.
2025-26 రంజీ ట్రోఫీ సీజన్లో ఐదుగురు తమిళనాడు బ్యాటర్లు రెండేసి హాఫ్ సెంచరీలు చేయగా.. అందులో నలుగురు లెఫ్టార్మ్ బ్యాటర్లుగా ఉన్నారు. పీఎమ్ఓఏ రూల్స్ ప్రకారం టీమ్ మేనేజర్లు మాత్రమే మొబైల్ ఫోన్స్ వాడవచ్చు. అది కూడా డగౌట్లో కాకుండా డ్రెస్సింగ్ రూమ్లో మాత్రమే ఉపయోగించాలి. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది తమ మొబైల్స్ స్విచాఫ్ చేసి అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. అనలిస్ట్లకు మాత్రమే కంప్యూటర్ వాడేందుకు అనుమతి ఉంటుంది.
ఐపీఎల్ 2026 సీజన్ సమయంలో రాజస్థాన్ రాయల్స్ మేనేజర్ రోమి భిందర్ డగౌట్లో మొబైల్ ఉపయోగించి జరిమానాకు గురయ్యాడు. బెట్టింగ్లను నిరోధించడానికి, బుకీలతో సంప్రదింపులు జరపకుండా ఉండేందుకు మొబైల్ వాడకాన్ని నిషేధించారు. అయితే రోమి భిందర్ ఘటనతో మేనేజర్లు డ్రెస్సింగ్ రూమ్లో మొబైల్ వాడవచ్చనే నిబంధనను కూడా తొలగించాలనే డిమాండ్ వ్యక్తమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

