
ముంబై: కిట్ స్పాన్సర్ల విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి గట్టి షాక్ తగిలింది. ఎంతటి కరోనా కాలమైనా సరే... ఇలాంటి స్పందనను బీసీసీఐ ఏ మాత్రం ఊహించలేదు. భారత క్రికెట్ జట్టుకు ఉన్న పాపులార్టీ, ఆటగాళ్లు గర్వంగా ధరించే టీమ్ జెర్సీ, కిట్లను స్పాన్సర్ చేసేందుకు పెద్ద పెద్ద సంస్థలే 'క్యూ' కడతాయని భావించిన బోర్డుకు తిరస్కరణ ఎదురైంది. మరో భారీ స్పాన్సర్షిప్ వేటలో ప్రతిష్టాత్మక 'నైకీ' సంస్థకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వడానికి అంగీకరించకుండా బిడ్లు కోరిన బోర్డుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కిట్ స్పాన్సర్షిప్ కోసం పోటీ పడిన నాలుగు సంస్థల్లో ఒక్కరు కూడా 'ఫైనాన్షియల్ బిడ్' వేయలేదు.
14 ఏళ్లు భారత కిట్ను స్పాన్సర్ చేసిన నైకీతో పాటు అడిడాస్, పూమాలాంటి దిగ్గజ స్పోర్టింగ్ కంపెనీలు, డ్రీమ్ ఎలెవన్కే చెందిన ఫ్యాన్ కోడ్ సంస్థ ప్రాధమికంగా ఆసక్తి చూపించి బిడ్లు కొనుగోలు చేశాయి. అయితే అసలు సమయానికి వీరంతా వెనక్కి తగ్గడం విశేషం. నిజానికి ఇప్పటి వరకు నైకీ ప్రతీ అంతర్జాతీయ మ్యాచ్కు బీసీసీఐ రూ. 85 లక్షల చొప్పున చెల్లిస్తూ వచ్చింది. దీనికి తగ్గించి బేస్ బ్రైస్ను రూ. 65 లక్షలకు చేసినా సరే... ఎవరూ ముందుకు రాకపోవడం ప్రస్తుత దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.
రాబోయే రోజుల్లో బ్రాండింగ్ ప్రమోషన్ విషయంలో బీసీసీఐ తమకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో వీరంతా స్పాన్సర్షిప్ నుంచి దూరం జరిగినట్లు తెలుస్తోంది. నిజానికి ఐపీఎల్ తర్వాత ఏమిటనే విషయంలో బోర్డు వద్దే సరైన ప్రణాళిక లేకపోవడంతోనే స్పాన్సర్లు ముందుకు రాలేదని సమాచారం. స్పాన్సర్ల రాకపోవడంతో అప్కమింగ్ ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు కిట్ స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగాల్సిన ప్రమాదం పొంచి ఉంది.