ఆసియా కప్ 2025 జట్టులో చోటు దక్కని టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు వన్డే ఫార్మాట్ సారథ్య బాధ్యతలు అప్పగించే యోచనలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ వారసుడిగా శ్రేయస్ అయ్యర్ వన్డే సారథ్య బాధ్యతలు స్వీకరిస్తాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఫార్మాట్కు ఓ కెప్టెన్ను ఉంచాలని టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నాడట. ఇప్పటికే టీ20 సారథిగా సూర్యకుమార్ యాదవ్, టెస్ట్ సారథిగా శుభ్మన్ గిల్ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వన్డే ఫార్మాట్కు శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్ను ఎంపిక చేయాలని గంభీర్ ఆలోచిస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.
అంతేకాకుండా రోహిత్ శర్మ కెరీర్ చివరి దశలో ఉందని, అతను వన్డే ప్రపంచకప్ 2027 వరకు జట్టులో కొనసాగడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే అయ్యర్కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐతో పాటు గంభీర్ సమాలోచనలు చేస్తున్నారని గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. అయితే ఈ వార్తలను బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఖండించాడు. అసలు ఇలాంటి చర్చే జరగలేదని స్పష్టం చేశాడు. ఓ జాతీయ ఛానెల్తో మాట్లాడిన సైకియా.. వన్డే కెప్టెన్సీ మార్పుపై క్లారిటీ ఇచ్చాడు. అలాంటి ఆలోచనే లేదని పేర్కొన్నాడు.

వన్డే ఫార్మాట్లో శ్రేయస్ అయ్యర్ గణంకాలు అద్భుతంగా ఉన్నాయి. గత వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో అయ్యర్ మెరుగైన ప్రదర్శన చేశాడు. దాంతో అతను కెప్టెన్సీ రేసులో ముందువరుసలో ఉంటాడనేది కాదనలేని వాస్తవం. కానీ అతనికి శుభ్మన్ గిల్ నుంచి తీవ్ర పోటీ ఉండనుంది. బీసీసీఐ వర్గాలు కూడా గిల్కే అండగా నిలిచినట్లు తెలుస్తోంది.
'వన్డేల్లో శుభ్మన్ గిల్ సగటు 59. ప్రస్తుతం అతను వైస్ కెప్టెన్గా ఉన్నాడు. ఇటీవలే టెస్ట్ సారథిగా తన సత్తాను నిరూపించాడు. ఇది అతనికి కలిసొచ్చే అంశం. మూడు ఫార్మాట్లకు అతనే కెప్టెన్గా ఎంపికవుతాడు. కానీ ఎప్పుడా? అనేది కాలమే నిర్ణయిస్తుంది.'అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.