భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించిన 2023-24 వార్షిక కాంట్రాక్ట్లపై మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాంట్రాక్ట్లు కేటాయించే విషయంలో బీసీసీఐ అవలంభించిన ద్వంద్వ వైఖరిని నిలదీసాడు. ఏ ప్రాతిపాదికన కాంట్రాక్ట్లు కేటాయించారని సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ పెద్దలను ప్రశ్నించాడు.
భారత ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్లను బీసీసీఐ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం నాలుగు గ్రేడ్ల్లో ఆటగాళ్లు ఈ వార్షిక కాంట్రాక్ట్లు అందుకున్నారు. టీ20ల్లో సత్తా చాటిన యువ ఆటగాళ్లందరికీ దాదాపు కాంట్రాక్ట్లు దక్కాయి. ఇక దేశవాళీ క్రికెట్కు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే కారణాలతో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లపై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.

'వార్షిక కాంట్రాక్ట్ల్లో ఈ సారి శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ల పేర్లను పరిశీలించడం లేదు.'అని బోర్డు తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. దేశవాళీ క్రికెట్ ఆడాలనే బీసీసీఐ ఆదేశాలను ఈ ఇద్దరూ ఆటగాళ్లు బేఖాతరు చేశారు. దాంతో వారిపై బోర్డు చర్యలు తీసుకుంది.
అయితే గాయంతో వన్డే ప్రపంచకప్ మధ్యలోని తప్పుకొని ఇప్పటి వరకు ఏ టోర్నీ ఆడని హార్దిక్ పాండ్యాకు ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హార్దిక్ పాండ్యా సైతం దేశవాళీ క్రికెట్ కంటే ఐపీఎల్కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడని, ఐపీఎల్ కోసమే సిద్దమవుతున్నాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ఇదే విషయాన్ని ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియా వేదికగా నిలదీసాడు. 'శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లు ఇద్దరూ ఎంతో ప్రతిభావంతులు. నేలకు కొట్టిన బంతిలా బలంగా పుంజుకుంటున్నారని ఆశిస్తున్నా. రెడ్ బాల్ క్రికెట్ ఆడవద్దని నిర్ణయించుకున్న హార్దిక్ పాండ్యా.. అతనిలా నిర్ణయం తీసుకున్న ఆటగాళ్లు.. జాతీయ జట్టుకు ఆడనప్పుడు దేశవాళీ వైట్బాల్ క్రికెట్ ఆడాలా..? రూల్స్ అందరికి వర్తించకపోతే భారత్ క్రికెట్ ఆశిస్తున్న ఫలితాలను సాధించలేదు.'అని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు.
ఇర్ఫాన్ పఠాన్కు మద్దతుగా అభిమానులు బీసీసీఐపై విమర్శలు గుప్పిస్తున్నారు. 2018 నుంచి హార్దిక్ పాండ్యా దేశవాళీ క్రికెట్ ఆడటం లేదని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం వెనుక ఉన్నద్వంద్వ వైఖరి ఏంటని ప్రశ్నిస్తున్నారు. జాతీయ జట్టుకు ఆడని ఆటగాళ్లు ఫిట్గా ఉంటే దేశవాళీ క్రికెట్ ఆడాలనే నిబంధన హార్దిక్ పాండ్యాకు ఎందుకు వర్తించదని నిలదీస్తున్నారు.
రూల్స్ అన్నప్పుడు అందరీకి సమంగా ఉండాలని, గుజరాత్ ఆటగాళ్లకు ఒకలా.. ఇతరులకు మరోలా ఉండకూడదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.