
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ అనుకున్న షెడ్యూల్ కంటే కాస్త ముందుగానే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. 10 జట్లు బరిలో నిలిచిన మెగా లీగ్ను మార్చి 26వ తేదీ నుంచి నిర్వహించాలని అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ ఇండియా చేసిన రిక్వెస్ట్ను బీసీసీఐ పరిశీలిస్తోంది. మార్చి 27న లీగ్ మొదలుపెట్టాలని బోర్డు ముందుగా అనుకుంది. ఆ రోజు ఆదివారం కాగా.. ఒక రోజు ముందగా శనివారం లీగ్ స్టార్ట్ చేస్తే.. తర్వాతి రోజు ఆదివారం డబుల్ హెడర్(రెండు మ్యాచ్లు) జరిపే వీలుంటుందని స్టార్ ఇండియా భావిస్తోంది.
దానివల్ల ఫస్ట్ వీకెండ్లోనే మూడు మ్యాచ్లు నిర్వహిస్తే.. 15వ సీజన్పు ఫుల్ జోష్తో మొదలు పెట్టొచ్చన విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై బ్రాడ్కాస్టర్తో బోర్డు పెద్దలు చర్చలు జరుపుతున్నారు. వచ్చే వారం లోపు దీనిపై తుది నిర్ణయానికి రావడంతో పాటు లీగ్ షెడ్యూల్ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ మార్చి 16న పూర్తవుతుంది కాబట్టి లీగ్ను ఒక రోజు ముందుకు జరపడం వల్ల భారత ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, దీనివల్ల ఆస్ట్రేలియా ప్లేయర్లు మాత్రం లీగ్లో మరో మ్యాచ్ను మిస్సయ్యే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ పర్యటన ఉన్న నేపథ్యంలో వారంతా ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నారు. ఏప్రిల్ 6 తర్వాతే మ్యాచ్లకు అందుబాటులోకి రానున్నారు. వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య సిరీస్ల నేపథ్యంలో ఈ రెండు దేశాల ఆటగాళ్లు ఏప్రిల్ 5న అందుబాటులోకి రానున్నారు.
'శనివారమే లీగ్ ప్రారంభిస్తే ఫస్ట్ వీకేండ్లోనే మూడు మ్యాచ్లు జరగడం ద్వారా బ్రాడ్ కాస్టర్కు కలిగే ప్రయోజనాన్ని అర్థం చేసుకోగలం. ఆదివారం ప్రారంభిస్తే బ్రాడ్ కాస్టర్కు నష్టం వాటిల్లుతుంది. ఈ ప్రతిపాదనపై బీసీసీఐ చర్చలు జరుపుతుంది. బోర్డు కూడా ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తొంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మార్చి 26నే లీగ్ ప్రారంభం కానుంది'అని ఓ ఫ్రాంచైజీ అధికారి తెలిపారు.