న్యూఢిల్లీ: 'ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుంది'టీమిండియా యువ ప్లేయర్స్ పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి. శ్రీలంక పర్యటనలో ప్రతీ అవకాశాన్ని రెండు చేతుల అందిపుచ్చుకొని దుమ్మురేపిన ఈ యువ ఈటగాళ్లు.. ఇంగ్లండ్ పర్యటనలోని ఐదు టెస్ట్ల సిరీస్కు ఎంపికయ్యారు. ఇక ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కడానికి సిద్దమవుతున్నా వేళ కృనాల్ పాండ్యా రూపంలో వారికి బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లండ్ ప్రభుత్వ కఠిన ఆంక్షల నేపథ్యంలో ఈ ఇద్దరూ యూకేకు వెళ్లడం కష్టంగా మారింది. వీరి స్థానాల్లో మరో ఇద్దరిని పంపించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇంగ్లండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఎంపికై... ఆ తర్వాత గాయాలతో దూరమైన భారత క్రికెటర్లు శుబ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షాలకు పిలుపొచ్చిని విషయం తెలిసిందే. టీ20 సిరీస్ ముగిసిన వెంటనే శ్రీలంక నుంచి నేరుగా ఇంగ్లండ్కు వెళ్లాల్సింది. వీరిద్దరు కూడా సిరీస్ కోసం ఏర్పాటు చేసిన బయో బబుల్లో ఉండటంతో ఇంగ్లండ్కు వెళ్లాక మళ్లీ క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని... డర్హమ్లో ఉన్న జట్టుతో కలవొచ్చని బీసీసీఐ ఇది వరకే స్పష్టం చేసింది.
అయితే కృనాల్ పాండ్యా పాజిటివ్తో ఈ పరిస్థితులన్నీ మారిపోయాయి. ఈ సిరీస్ ముగిశాక సూర్యకుమార్, పృథ్వీ షా ఇంగ్లండ్కు వెళ్లినా... అక్కడ 10 రోజుల క్వారంటైన్ను పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా కృనాల్కు సన్నిహితంగా 8 మంది ఆటగాళ్లలో ఈ ఇద్దరు ఉండటం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది.
బయో బబుల్ నిబంధనల ప్రకారం కరోనా సోకిన ఆటగాళ్లు, వారికి సన్నిహితంగా ఉన్న ప్లేయర్స్ ఐసోలేషన్లో 10 రోజుల పాటు ఉండాలి. ఇదే జరిగితే ఆగస్టు 6 వరకు ఈ ఇద్దరు అక్కడనే ఉండనున్నారు. 7న ఇంగ్లండ్ పయనమైన అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం మరో 10 రోజుల క్వారంటైన్ ఉండాలి. అలా చేస్తే టీమిండియా అప్పటికే మూడు టెస్ట్లు పూర్తి చేసుకుంటుంది. చివరి రెండు మ్యాచ్లే షా, సూర్య ఆడగలరు.
ఈ క్రమంలోనే సూర్య, పృథ్వీషా స్థానాల్లో మరో ఇద్దరిని పంపించాలా? వద్దా? అనేదానిపై సమాలోచనలు చేస్తున్నామని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. 'ఈ పరిస్థితుల్లో ఏ విషయంపై మేం మాట్లాడదలుచుకోవడం లేదు. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. షా, సూర్య స్థానాల్లో ఇతరులను పంపించాలా? వద్దా? అనేదానిపై సమాలోచనలు చేస్తున్నాం.'అని సదరు అధికారి పేర్కొన్నారు.