టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ గాయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పందించింది. బుధవారం(జనవరి 7) రాజ్కోట్లో తిలక్ వర్మ వృషణాలకు శస్త్ర చికిత్స జరిగిందని తెలిపింది. గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తిలక్ వర్మ.. ప్రస్తుతం బాగానే ఉన్నాడని పేర్కొంది. ఈ సర్జరీ కారణంగా న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో తొలి మూడు మ్యాచ్లకు తిలక్ వర్మ దూరంగా ఉంటాడని తెలిపింది.
'న్యూజిలాండ్తో తొలి మూడు టీ20లకు తిలక్ వర్మ దూరమయ్యాడు. బుధవారం రాజ్కోట్లో తిలక్ వర్మకు వృషణాల్లో సర్జరీ జరిగింది. గురువారం ఉదయమే అతను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. శుక్రవారం హైదరాబాద్కు వెళ్లనున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది.

అతని నొప్పి పూర్తిగా తగ్గిన తర్వాత ఫిజికల్ ట్రైనింగ్ మొదలు పెడుతాడు. ఆ తర్వాత స్కిల్ బేస్డ్ యాక్టివిటీలు చేస్తాడు. ప్రస్తుతానికి తిలక్ వర్మ న్యూజిలాండ్తో తొలి మూడు టీ20లకు దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకొని ఫిట్నెస్ సాధిస్తే మిగతా రెండు మ్యాచ్ల్లో బరిలోకి దిగుతాడు.'అని బీసీసీఐ తమ ప్రకటనలో పేర్కొంది.
ఫిబ్రవరి 7న టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో తిలక్ వర్మకు శస్త్రచికిత్స జరగడం టీమిండియాకు ఆందోళన కలిగించే అంశం. విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్తో మ్యాచ్ కోసం హైదరాబాద్ జట్టుతో తిలక్ రాజ్కోట్ వెళ్లాడు. మంగళవారం జరిగిన మ్యాచ్లో బరిలోకి దిగాడు. మ్యాచ్ సందర్భంగా అతనికి ఎలాంటి గాయం కాలేదు. కానీ బుధవారం తీవ్రమైన నొప్పితో విలవిల్లాడాడు. స్కానింగ్ తీశాక.. సర్జరీ అవసరమని వైద్యులు సూచించారని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. బీసీసీఐ స్పెషలిస్ట్ డాక్టర్లు సైతం సర్జరీ చేయాల్సిందేనని చెప్పడంతో తిలక్ వర్మకు శస్త్ర చిక్సిత చేయించుకున్నాడని సధరు అధికారి మీడియాకు వెల్లడించాడు.
న్యూజిలాండ్తో ఈ నెల 21న ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. 28న రెండో టీ20, 31న మూడో టీ20 జరగనుంది. ఈ మూడు మ్యాచ్లకు తిలక్ దూరమయ్యాడు. అతని స్థానంలో ఆడే ఆటగాడిని బీసీసీఐ ఇంకా ఎంపిక చేయలేదు. శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, రిషభ్ పంత్ రేసులో ఉన్నారు. ఒకవేళ తిలక్ వర్మ పూర్తిగా కోలుకొని చివరి రెండు టీ20ల్లో బరిలోకి దిగితే.. టీ20 ప్రపంచకప్ కూడా ఆడనున్నాడు.