టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై వేటు పడనుందని, ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్ కోచింగ్ బాధ్యతల నుంచి అతన్ని తొలగించనున్నారని గత రెండు రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మిశ్రమ ఫలితాలను అందుకుంది. వైట్బాల్ ఫార్మాట్లో టీమిండియా అద్భుత విజయాలు అందుకున్న.. టెస్ట్ల్లో ఘోర పరాజయాలను చవిచూసింది. ముఖ్యంగా భారత క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సొంతగడ్డపై న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్లో క్లీన్ స్వీప్ అయ్యింది.
ఇంగ్లండ్ గడ్డపై ఐదు టెస్ట్ల సిరీస్ను సమం చేసుకున్న భారత్.. సొంతగడ్డపై సౌతాఫ్రికా చేతిలో చిత్తయ్యింది. రెండు టెస్ట్ల సిరీస్లో క్లీన్ స్వీప్ అయ్యింది. ఈ పరాజయాల నేపథ్యంలో గంభీర్ పనితీరుపై బీసీసీఐ అసంతృప్తిగా ఉందని, టెస్ట్ ఫార్మాట్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా గంభీర్ వ్యూహాలను మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు తప్పుబడుతున్నారు.

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ అయితే గంభీర్ టెస్ట్ కోచింగ్ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకొని రంజీ టీమ్కు కోచ్గా పనిచేయాలని సూచించాడు. టెస్ట్ టీమ్ను ఎలా నిర్మించాలో తెలుసుకోవాలన్నాడు.
ఇక టీమిండియా హెడ్ కోచ్ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని బీసీసీఐ ఖండించింది. 2027 వరకు టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ కొనసాగుతాడని బీసీసీఐ స్పష్టం చేసింది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియాతో పాటు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. 'కోచ్ మార్పుపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ ఊహాగానాలు మాత్రమే. లీడర్షిప్ మార్పు గురించి బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గౌతమ్ గంభీర్ స్థానంలో మరొకరిని తెస్తున్నారన్నది కొందరి కల్పితం మాత్రమే.' అని ఆయన స్పష్టం చేశారు. రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. '2027 వన్డే ప్రపంచకప్ వరకు గౌతమ్ గంభీర్ మూడు ఫార్మాట్ల హెడ్ కోచ్గా కొనసాగుతారు'అని పేర్కొన్నారు.