అందుకే సూర్యకుమార్ యాదవ్ను తప్పించాం: అజిత్ అగార్కర్
అందరూ ఊహించినట్లుగానే టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై వేటు పడింది. పేలవ ఫామ్ నేపథ్యంలో టీ20 సారథ్య బాధ్యతల నుంచి అతన్ని భారత సెలెక్టర్లు తప్పించారు. జట్టులో చోటు కూడా ఇవ్వలేదు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 గెలిపించాడనే విశ్వాసం కూడా చూపించలేదు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా గేమ్స్ ఆడే భారత టీ20 జట్లను అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది.
శ్రేయస్ అయ్యర్ను నూతన టీ20 సారథిగా ఎంపిక చేసిన సెలెక్షన్ కమిటీ.. తెలుగు తేజం తిలక్ వర్మను వైస్ కెప్టెన్గా నియమించింది. అప్కమింగ్ టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా ఈ మార్పులు చేసినట్లు అర్థమవుతుంది. సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను కూడా సెలెక్టర్లు పట్టించుకోలేదు.
ఫామ్ కోల్పోవడంతోనే..
సూర్యకుమార్ యాదవ్పై వేటు వేయడానికి గల కారణాన్ని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ సరిగ్గా లేదని, అప్కమింగ్ టీ20 ప్రపంచకప్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. ప్రపంచకప్ గెలిచినా టీమ్ భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశాడు. టీమిండియా టీ20 కెప్టెన్సీకి శ్రేయస్ అయ్యర్ పూర్తి అర్హుడని అగార్కర్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

ఐసీసీ టీ20ప్రపంచకప్లోనూ సూర్యకుమార్ యాదవ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 9 ఇన్నింగ్స్ల్లో 242 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్లో కూడా తీవ్రంగా నిరాశపర్చాడు. ముంబై ఇండియన్స్ తరఫున 13 మ్యాచ్ల్లో 20.76 సగటుతో 270 పరుగులే చేశాడు. అతని వైఫల్యం ముంబై విజయవకాశాలను దెబ్బతీసింది.
అయ్యర్పై విశ్వాసం..
మరోవైపు శ్రేయస్ అయ్యర్ అటు బ్యాటర్గా.. ఇటు కెప్టెన్గా సత్తా చాటుతున్నాడు. ఐపీఎల్ 2025లో 604 పరుగులు చేసిన అయ్యర్.. తాజా సీజన్లో 498 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ను ఛాంపియన్గా నిలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లను ఫైనల్స్ చేర్చాడు.
శ్రేయస్ అయ్యర్ నాయకత్వ ప్రతిభపై సెలెక్టర్లకు నమ్మకం ఉందని అగార్కర్ తెలిపాడు. కెప్టెన్గా అయ్యర్ను నియమించడం గొప్ప నిర్ణయమని పేర్కొన్నాడు. కెప్టెన్గా అతనికి అపారమైన అనుభవం ఉందన్నాడు.సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్ రాకతో భారత టీ20 క్రికెట్లో కొత్త అధ్యాయం మొదలైంది. విచిత్రకరమైన విషయం ఏంటంటే.. సూర్యకుమార్ యాదవ్ కారణంగానే శ్రేయస్ అయ్యర్ గత రెండేళ్లుగా టీ20 క్రికెట్కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అతని స్థానంలోనే రీఎంట్రీ ఇచ్చాడు.
ఇది సరికాదు..
అయితే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు తప్పుబడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్కు ఇంకాస్త సమయం ఇవ్వాల్సిందని, ఇలా తప్పించడం వల్ల తప్పుడు సంకేతం వెళ్తుందని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు.
ప్రపంచకప్ గెలిచిన ఆటగాడిపై వేటు వేయడం అన్యాయమని మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. కనీసం జట్టులోనైనా చోటివ్వాలని సూచించాడు. మరోవైపు సూర్య బ్యాటింగ్లో విఫలమైనా కెప్టెన్గా సత్తా చాటాడని అతని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అసలు అతను చేసిన పాపం ఏంటి? అని నిలదీస్తున్నారు. కోహ్లీ, రోహిత్ ఫామ్ కోల్పోయినప్పుడు అవకాశాలు ఇవ్వలేదా? అని గుర్తు చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

