
ముంబై: టీమిండియా ఆటగాళ్లకు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్టులను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. 2022-23కు సంబంధించిన ఈ వివరాలను ఆదివారం వెల్లడించింది. ఆటగాళ్లకు సంబంధించిన వార్షిక వేతనాలను బీసీసీఐ నాలుగు విభాగాలు విభజించి ఆటగాళ్లకు అందిస్తున్న విషయం తెలిసిందే. తాజా కాంట్రాక్టుల్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు ప్రమోషన్ దక్కింది. ఏ నుంచి ఏ ప్లస్ కేటగిరికి అతను ప్రమోట్ అయ్యాడు. మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణించడంతో పాటు భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుండటంతో జడేజాకు ఏ ప్లస్ కేటగిరి దక్కింది.
తాజా కాంట్రాక్టుల్లో ఏ+ కేటగిరిలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. 2022 జూలైలో గాయపడిన జస్ప్రీత్ బుమ్రా.. గత 6 నెలలుగా ఆటకు దూరమైన కూడా ఏ+ కాంట్రాక్ట్లోనే ఉంచారు. ఏ+ కేటగిరిలో ఉన్న నలుగురు ప్లేయర్లకు రూ.7 కోట్ల వార్షిక వేతనం అందుతుంది.
టీమిండియా టీ20 కెప్టెన్ హార్ధిక్ పాండ్యాతో పాటు రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, రిషభ్ పంత్, అక్షర్ పటేల్.. ఏ కేటగిరిలో చోటు దక్కించుకోగా... ఇన్నాళ్లు ఈ కేటగిరిలో ఉన్నకేఎల్ రాహుల్ మాత్రం బీ కేటగిరికి డీమోట్ అయ్యాడు. అతని పేలవ ప్రదర్శన నేపథ్యంలోనే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏ కేటగిరిలో ఉన్న ఐదుగురు ప్లేయర్లకు రూ.5 కోట్ల వార్షిక వేతనం అందనుంది.
టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పూజారాతో పాటు యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్.. బీ గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. గతేడాది సీ గ్రేడ్లో ఉన్న శుబ్మన్ గిల్కు ప్రమోషన్ దక్కగా ఈ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు రూ.3 కోట్ల పారితోషికం దక్కనుంది.
టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్, తెలుగు తేజం కేఎస్ భరత్, అర్ష్దీప్ సింగ్, దీపక్ హుడాలు తొలిసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు దక్కించుకున్నారు. వీరిని బీసీసీఐ సీ గ్రేడ్ కేటగిరిలో ఎంపిక చేసింది. అతనితో పాటు ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, కేఎస్ భరత్లకు గ్రేడ్ సీలో కాంట్రాక్ట్ దక్కింది. మూడు ఫార్మాట్లలో చోటు కోల్పోయిన శిఖర్ ధావన్ను బీసీసీఐ కొనసాగించింది. సీ గ్రేడ్ ఆటగాళ్లకు ఏడాదికి కోటీ వార్షిక వేతనం అందనుంది.
గతేడాది బీ గ్రేడ్లో ఉన్న అజింక్యా రహానే, ఇషాంత్ శర్మలతో పాటు వృద్ధిమాన్ సాహా, భువనేశ్వర్ కుమార్, హనుమ విహారి, మయాంక్ అగర్వాల్, దీపక్ చాహార్లు కూడా బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్లను కోల్పోయారు.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ 2022-23 జాబితా..
గ్రేడ్ ఏ+: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా
గ్రేడ్ ఏ: హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, రిషబ్ పంత్, అక్షర్ పటేల్
గ్రేడ్ బీ: ఛతేశ్వర్ పూజారా, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుబ్మన్ గిల్
గ్రేడ్ సీ: ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, కెఎస్ భరత్