వన్డే టీమ్ ప్రకటించేటప్పుడు..
అయితే రోహిత్ మాదిరే.. వైస్ కెప్టెన్సీ పదవి కేఎల్ రాహుల్నే వరించినట్లు తెలుస్తోంది. రోహిత్కు డిప్యూటీగా అతడిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వన్డే వైస్ కెప్టెన్ రేసులో రిషభ్ పంత్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ.. ఈ యువ ఆటగాడికి ఇప్పుడే ఆ బాధ్యతలు అప్పజెప్పడం తొందరపాటు నిర్ణయం అవుతుందని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సౌతాఫ్రికా పర్యటనతో రాహుల్ పూర్తిస్థాయి వైస్ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరిస్తాడని, దీనికి సంబంధించిన ప్రకటన వన్డే టీమ్ సెలెక్షన్ సందర్భంగా వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్సైడ్స్పోర్ట్ వెబ్సైట్కు తెలిపారు.
పంత్ చిన్నోడే..
'కేఎల్ రాహులే తర్వాతి వైస్ కెప్టెన్. పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్కు డిప్యూటీగా మరో ఛాయిస్ లేదు. కాబట్టి సుదీర్ఘకాలంగా వైట్ బాల్ క్రికెట్లో అదరగొడుతున్న కేఎల్ రాహుల్ వైపే మొగ్గుచూపడం సహజం. సమీప కాలంలో తను కెప్టెన్గా ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి. రోహిత్, విరాట్, ద్రవిడ్ మార్గదర్శనంలో తను మరో స్థాయికి ఎదుగుతాడు.
రిషభ్ పంత్ పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ అతను చాలా చిన్నవాడు. ఇప్పుడే అతనికి అంత పెద్ద బాధ్యతలు అప్పగిస్తే ఒత్తిడికి గురవుతాడు. సీనియర్ల నుంచి అతను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కెప్టెన్ గైర్హాజరీలో జట్టును ముందుండి నడిపించడం తనకు తలమించిన భారం అవుతుందనేది మా అభిప్రాయం.'అని సదరు అధికారి చెప్పుకొచ్చారు.
రాహులే ఎందుకంటే..?
ఇక కేఎల్ రాహులే తదుపరి వైస్ కెప్టెన్ ఎందుకు అవుతాడంటే.. ఇంగ్లండ్ పర్యటన తర్వాత రాహుల్ అన్ని ఫార్మాట్లలో ఆడగలిగే ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతానికి వన్డేల్లో కేఎల్ రాహుల్ కంటే మంచి రికార్డు ఉన్న ఆటగాడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్కు సారథిగా వ్యవహరించిన రాహుల్... గత రెండేళ్లలో అంతర్జాతీయ వన్డేల్లో సాధించిన సగటు 61.92. న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో భాగంగా పొట్టి ఫార్మాట్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. సీనియర్లు కోహ్లీ, రోహిత్ శర్మ, హెడ్కోచ్తో ఈ కర్ణాటక వికెట్ కీపర్కు మంచి సంబంధాలు ఉన్నాయి.