భారత ఫురుషుల సెలెక్షన్ కమిటీలో కీలక మార్పు చోటు చేసుకుంది. అజిత్ అగార్కర్ సారథ్యంలోని ఈ సెలెక్షన్ కమిటీలో భారత క్రికెట్ నియంత్రణ(మండలి) ఒక సభ్యుడిని మార్చింది. టీమిండియా మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రాను సెలెక్టర్గా ఎంపిక చేసింది.
ఈ విషయాన్ని బీసీసీఐ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తాజా మాజీ సెలెక్టర్ సలీల్ అంకోలా స్థానాన్ని అజయ్ రాత్రాతో భర్తీ చేసింది. టీమిండియా ఛీప్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, సలీల్ అంకోలా ఇద్దరూ వెస్ట్ జోన్కు చెందినవారే కావడంతో ఈ మార్పు చేయాల్సి వచ్చింది. అజయ్ రాత్రా నార్త్ జోన్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

'అజిత్ అగార్కర్ సారథ్యంలో పురుషుల సెలెక్షన్ కమిటీలో అజయ్ రాత్రాను కొత్త సభ్యుడిగా క్రికెట్ అడ్వైజరీ కమీటీ ఆఫ్ బీసీసీఐ ఎంపిక చేసింది. సలీల్ అంకోలా స్థానాన్ని అజయ్ రాత్రా భర్తీ చేయనున్నారు. భారత మాజీ వికెట్ కీపర్ అయిన అజయ్ రాత్రాకు అపారమైన అనుభంతో పాటు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.
అతను అంతర్జాతీయ క్రికెట్తో దేశవాళీ క్రికెట్ ఆడాడు. భారత్ తరఫున 6 టెస్ట్లతో పాటు 12 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు. హర్యానాకు చెందిన అజయ్ రాత్రా 90 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 4000 పరుగులు చేశాడు. వికెట్ కీపర్గా 200 డిస్మిసల్స్లో భాగమయ్యాడు. సెలెక్టర్గా ఇతర సభ్యులతో కలిసి అజయ్ రాత్రా పనిచేయబోతున్నాడు.
అప్కమింగ్ స్టార్స్ను గుర్తించి టీమిండియాకు ఎంపిక చేయనున్నాడు. అజయ్ రాత్రాకు కోచ్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అతను అస్సామ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ జట్లకు హెడ్ కోచ్గా వ్యవహరించారు. టీమిండియా సౌతాఫ్రికా పర్యటన 2023లో సపోర్ట్ స్టాఫ్గా వ్యవహరించాడు. అత్యుత్తమ ఆటగాళ్లను భారత క్రికెట్కు అందించడంలో అజయ్ రాత్రా అనుభవం ఉపయోగపడనుంది.'అని బీసీసీఐ తమ ప్రకటనలో పేర్కొంది.
అజిత్ అగార్కర్ సారథ్యంలోని ప్రస్తుత సెలెక్షన్ కమిటీలో శివ్ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, శ్రీథరన్ శరత్ సభ్యులుగా ఉన్నారు. ఓ మీడియా స్ట్రింగ్ ఆపరేషన్లో బీసీసీఐతో పాటు సీనియర్ ఆటగాళ్ల సీక్రెట్స్ బయటపెట్టిన మాజీ చీఫ్ సెలెక్టర్ ఛేతన్ శర్మ.. తన పదవిని కోల్పోయాడు. దాంతో బీసీసీఐ అజిత్ అగార్కర్ను చీఫ్ సెలెక్టర్గా ఎంపిక చేసింది.
ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో జరిగే రెండు టెస్ట్ల సిరీస్తో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇదే తొలి టెస్ట్ సిరీస్.