
ఛైర్మన్గా చేతన్:
ఇప్పటి వరకు సునీల్ జోషి చైర్మన్గా వ్యవహరించినా.. ఇప్పటినుంచి చేతన్ శర్మ ఆ పదవిని చేపట్టనున్నారు. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఎక్కువ టెస్టులు ఆడిన ఆటగాడు సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా ఉండాలి. కాబట్టి ఇదివరకు ఛైర్మన్గా ఉన్న జోషి (15 టెస్టులు) కంటే చేతన్ (23)కే ఎక్కువ అనుభవం ఉంది. కాబట్టి అతనికే ఆ పదవి దక్కింది. భారత్ తరపున చేతన్ 23 టెస్టులు, 65 వన్డేలు ఆడారు. అంతేకాదు 1987 ప్రపంచకప్లో హ్యాట్రిక్తో చరిత్ర సృష్టించారు. 'భారత క్రికెట్కు మరోసారి సేవ చేసే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవం. నేను మాటల వ్యక్తిని కాదు. నా చేతలే ఎక్కువగా మాట్లాడతాయి. ఈ అవకాశమిచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు' అని చేతన్ చెప్పారు.

వర్చువల్ ఇంటర్వ్యూలు:
సెలక్టర్లుగా జతిన్, దేవాంగ్, శరణ్దీప్ సింగ్ పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్లో ముగియడంతో బీసీసీఐ ఆ మూడు స్థానాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్, చేతన్ శర్మ, మణిందర్ సింగ్, నయన్ మోంగియా, శివసుందర్ దాస్, రణదేబ్ బోస్ తదితరులు దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో నుంచి పదకొండు మందితో తుది జాబితా రూపొందించిన సీఏసీ.. వాళ్లకు తాజాగా వర్చువల్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. భారత్ భవిష్యత్ ప్రణాళికలు, జట్టుకు ఇద్దరు కెప్టెన్లు తదితర ప్రశ్నలు.. అభ్యర్థులను అడిగినట్లు సమాచారం.

అగార్కర్కు షాక్:
వెస్ట్జోన్ నుంచి అజిత్ అగార్కర్, అబయ్ కురువిల్లా పోటీలో నిలిచారు. 26 టెస్టులాడిన అనుభవం ఉన్న అగార్కర్.. ఈ సారి సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అయ్యేలా కనిపించారు. అయితే సీఏసీ మాత్రం జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా అనుభవం ఉన్న కురువిల్లాకే ఓటు వేసింది. 10 టెస్టులాడిన కురువిల్లా.. 2008 నుంచి 2012 వరకు జూనియర్ సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. కురువిల్లా కమిటీ ఛైర్మన్గా ఉన్న సమయంలో 2012లో భారత్ అండర్-19 ప్రపంచకప్ గెలిచింది. 'అగార్కర్కు ముంబై క్రికెట్ సంఘం నుంచి ఎలాంటి మద్దతు లేదు. సెలక్టర్గా ఉన్నపుడు అతను జట్టు మ్యాచ్లు చూసేవాడు కాదనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి కురువిల్లాకు ముంబై అండగా నిలిచింది' అని ఓ బీసీసీఐ ప్రతినిధి చెప్పారు.

ఇంగ్లాండ్తో సిరీస్కు ఎంపిక:
చేతన్ శర్మ నార్త్జోన్ నుంచి, దేబాసిస్ మొహంతి ఈస్ట్జోన్ నుంచి ఎంపికయ్యారు. చేతన్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ మొదటగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆరంభం కానున్న స్వదేశంలో ఇంగ్లాండ్తో సిరీస్కు భారత జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఈ సెలక్షన్ కమిటీ పనితీరును ఏడాదిపాటు సీఏసీ పర్యవేక్షించనుంది.


Click it and Unblock the Notifications

5 నెలల గర్భం.. 10 కి.మీ పరుగు!! 62 నిమిషాల్లోనే!










