న్యూఢిల్లీ: ఊపిరి సలపని షెడ్యూల్తో బిజీ బిజీగా గడిపిన టీమిండియా ఆటగాళ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నెల రోజుల విశ్రాంతినిచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి నుంచి తేరుకునేందుకు భారత క్రికెట్కు సుదీర్ఘ విరామం ప్రకటించింది. మధ్యలో అఫ్గానిస్థాన్తో వన్డే సిరీస్ ఆడాల్సి ఉన్నా వాయిదా వేసింది. వెస్టిండీస్ పర్యటనలోనే భారత ఆటగాళ్లు మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నారు.
ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను బీసీసీఐ సోమవారం రాత్రి అధికారిక ప్రకటించింది. జూల్ 12 నుంచి ఆగస్ట్ 13 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ముందుగా రెండు టెస్ట్ల సిరీస్ జరగనుండగా.. జూలై 12-16 మధ్య డొమినక వేదికగా తొలి టెస్ట్, జూలై 20-24 మధ్య ట్రినిడాడ్ వేదికగా రెండో టెస్ట్ జరగనుంది.

మూడు వన్డేల సిరీస్ జూలై 27న ప్రారంభమై ఆగస్టు 13న ముగుస్తుంది. తొలి వన్డే జూలై 27న, రెండో వన్డే జూలై 29న, మూడో వన్డే ఆగస్టు 1న జరగనుంది. ఐదు టీ20ల సిరీస్ ఆగస్టు 4 నుంచి 13వరకు జరగనుండగా.. తొలి టీ20 ఆగస్టు 4, రెండో టీ20 ఆగస్టు6న, మూడో టీ20 ఆగస్టు 8న, నాలుగో టీ20 ఆగస్టు 12న, ఐదో టీ20 ఆగస్టు 13న నిర్వహించనున్నారు.
వన్డే సిరీస్తో పాటు టెస్ట్ సిరీస్ రోహిత్ శర్మ సారథ్యంలోని జట్టు ఆడనుండగా.. టీ20 సిరీస్ను హార్దిక్ పాండ్యా సారథ్యంలోని యువ జట్టు ఆడనుంది.ఈ మూడు సిరీస్లను ఓటీటీ ఫ్లాట్ఫామ్ జియోసినిమా ఉచితంగా ప్రసారం చేయనుంది. ఈ మేరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అధికారిక ఓటీటీ బ్రాడ్ కాస్టర్ ఫ్యాన్ కోడ్తో జియోసినిమా ఒప్పందం కుదుర్చుకుంది. టీవీలో భారత ప్రభుత్వానికి చెందిన డీడీ స్పోర్ట్స్లో ఈ మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.
వెస్టిండీస్ పర్యటనలోని మ్యాచ్ టైమింగ్స్ భారత టైమింగ్స్కు విరుద్దంగా ఉండనున్నాయి. ఈ క్రమంలోనే కమర్షియల్గా లాభం ఉండదని పెద్ద చానెళ్లు అయిన స్టార్ స్పోర్ట్స్, సోనీ ఈ సిరీస్లకు దూరంగా ఉన్నాయి.
ఇక నెల రోజుల విరామాన్ని భారత ఆటగాళ్లు ఆస్వాదించనున్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి వేకేషన్స్ను విదేశాలకు వెళ్లనున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, ఇతర ఆటగాళ్లు కుటుంబంతో గడిపేందుకు సిద్దమవుతున్నారు.