
న్యూఢిల్లీ: ఆలిండియా సీనియర్ పురుషుల సెలెక్షన్ కమిటీని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. ఐదుగురు సభ్యులతో కూడిన వివరాలను శనివారం వెల్లడించింది. చేతన్ శర్మనే మళ్లీ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్గా ఎంపిక చేసింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో టీమిండియా సెమీస్లోనే వెనుదిరగడంతో చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీని రద్దు చేసిన బీసీసీఐ.. కొత్త సెలెక్షన్ కమిటీకి దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. మొత్తం 600 అప్లికేషన్స్ రాగా.. బీసీసీఐ నియమించిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ఐదుగురిని ఎంపిక చేసింది.
సెలెక్షన్ కమిటీలో చోటు దక్కించుకున్న మాజీ టెస్ట్ ఓపెనర్ శివ సుందర్ దాస్ సెంట్రల్ జోన్కు ప్రాతినిథ్యం వహించనుండగా.. మాజీ పేసర్ సుబ్రోతో బెనర్జీ ఈస్ట్ జోన్, సలిల్ అంకోల వెస్ట్ జోన్, శ్రీధరన్ శరత్ సౌత్ జోన్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ వైఫల్యంతో చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీని రద్దు చేసిన బీసీసీఐ.. మళ్లీ అతన్నే చైర్మన్గా ఎంపిక చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.